కరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీ
తొమ్మిది నెలలుగా భూగోళాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 9.3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లకు చేరువైంది. రోజులు గడుస్తున్నకొద్దీ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్ సహా అగ్రదేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా పుట్టినిల్లయిన చైనా సైతం వ్యాక్సిన్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. డ్రాగన్ దేశం కావాలనే కరోనాను సృష్టించిందనే ఆరోపణల నడుమ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రభుత్వం సంచలన ప్రకటనలు చేసింది.
Recommended Video
పార్లమెంట్పై కరోనా ఎఫెక్ట్: 25 మంది ఎంపీలకు పాజిటివ్ - తొలిరోజు లోక్సభకు 359మందే
గత ఏప్రిల్ లోనే వ్యాక్సిన్?
కరోనాపై మొదటి నుంచీ తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచాన్నిఆగంపట్టించిన చైనా.. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. చైనీస్ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని, తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్ నాటికి ప్రజలందరూ వాడటానికి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ ఆధీనంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్ వూ తెలిపారు. అంతటితో ఆగకుండా, గత ఏప్రిల్ నాటికే కరోనా వ్యాక్సిన్ తయారు చేశామని, తాను కూడా డోసు తీసుకున్నానని ఆమె చెప్పడం కొత్త చర్చకు తెరలేపినట్లయింది. అదే నిజమైతే, ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ చైనాదే కావాలి, కానీ ఆ విషయాన్ని ఇన్ని నెలలు దాచి ఉంచడం వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నాలుగు వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్ను తీసుకున్నారనే విషయాన్ని మాత్రం గైఝెన్ చెప్పలేదు.
కంపెనీలపై కమ్యూనిస్టుల ఒత్తిడి..
గత ఏప్రిల్ లోనే కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకున్నానని సీడీసీ నిపుణురాలు చెప్పడం ఒక ఎత్తయితే.. విసృత స్థాయి ఉత్పత్తి కోసం ఫార్మా కంపెనీలపై చైనా కమ్యూనిస్ట్ సర్కారు ఒత్తిడి పెంచుతున్నట్లు వెల్లడికావడం కలకలం రేపుతున్నది. ఒక్కసారి వ్యాక్సిన్ విడుదలైన తర్వాత ఎన్నో పేదదేశాలు దానిని వాడే అవకాశం ఉన్నందున చైనా తయారీ వ్యాక్సిన్లపై అనుమానాలు పెరుగుతున్నాయి. యూరప్, అమెరికా సహా ఆసియాలోని ఇతర దేశాలు వ్యాక్సిన్ తయారీలో జాగ్రత్తలు పాటిస్తూ, శాస్త్రీయంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తైన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతుండగా, చైనా మాత్రం సేఫ్టీకి గ్యారంటీ ఇవ్వకుండానే నవంబర్ లో వ్యాక్సిన్ విడుదల చేస్తామని చెబుతుండటం గమనార్హం.
ముందుగా సైన్యానికే వ్యాక్సిన్
చైనా జాతీయ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్), సినోవాక్ బయోటెక్తో కలిసి మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. కాగా, వీటి ప్రయోగాలు చైనాతోపాటు యూఏఈలోనూ కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సినోఫార్మ్ జులై నెలలోనే ప్రకటించింది. కాన్సినో బయోలాజిక్స్ రూపొందించిన మరో వ్యాక్సిన్ కూడా తుది దశ ప్రయోగాల్లో ఉండగా.. వాటి డోసుల్ని ముందుగా చైనా సైన్యానికే అందిస్తామని గత జూన్ లోనే ఆ సంస్థ ప్రకటించింది. చైనీస్ ఫార్మా కంపెనీల ప్రయోగాలు యూఏఈలో జరుగుతున్నందున.. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఏఈ ప్రభుత్వం అంగీకరించింది. సినోఫార్మ్ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో 31వేల మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ప్రజలందరికీ వ్యాక్సిన్ అవసరంలేదు
ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వాల్సిన అవసరం లేదని చైనా సర్కారు భావిస్తున్నది. ముందుగా సైనికులు, ఆ తర్వాత కొవిడ్పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నామని, సాధారణ ప్రజలు అందరికీ డోసులు అవసరం లేదని చైనా సీడీసీ డైరెక్టర్ చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే విషయంలో ఖర్చులతో పాటు లాభనష్టాల వంటి అంశాలను పూర్తిస్థాయిలో గుర్తించవలసి ఉందని, భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేస్తూ వెళితే, అరుదుగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, అందుచేత ప్రజలందరికీ టీకా వేయాల్సిన అవసరం లేదని సీడీసీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు.