భారత్-బ్రహ్మపుత్రపై భారీ కుట్ర: అంతా అబద్దం.. చైనా స్పందన
బ్రహ్మపుత్ర నదీ జలాలను తరలించేందుకు పొడవైన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు చైనా యోచిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై డ్రాగన్ కంట్రీ స్పందించింది.
బీజింగ్: బ్రహ్మపుత్ర నదీ జలాలను తరలించేందుకు పొడవైన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు చైనా యోచిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై డ్రాగన్ కంట్రీ స్పందించింది.
మన బ్రహ్మపుత్రపై చైనా భారీ కుట్ర: ప్రపంచ పొడవైన టన్నెల్తో నీటి తరలింపు!
అంతా అబద్దం
భారీ సొరంగ మార్గం అంటూ వచ్చిన వార్తలు అబద్దమని చైనా దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ అన్నారు. బ్రహ్మపుత్ర నదీ జలాలను తరలించనున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సరిహద్దు జలాల ఒప్పందానికి కట్టుబడి ఉంటాం
సరిహద్దు జలాల ఒప్పందానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు. పొరుగు దేశాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నదీ జలాలను తరలించేందుకు చైనా కుట్ర పన్నుతోందని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో కథనం వచ్చింది.
కథనం ఇచ్చిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్
అరుణాచల్ ప్రదేశ్కు సమీప టిబెట్ నుంచి బ్రహ్మపుత్ర నదీ జలాలను ఎడారి ప్రాంతం షిన్ జియాంగ్కు తీసుకు వెళ్లాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
వెయ్యి కిలోమీటర్ల సొరంగం
ఇందుకోసం వెయ్యి కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని తవ్వేందుకు చైనా ఇంజినీర్లు గత మార్చి నెలలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు పేర్కొంది. ఈ పథకం కార్యరూపం దాల్చితే బ్రహ్మపుత్ర నది దిగువనున్న భారత్, బంగ్లాదేశ్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, దాంతో పాటు హిమాలయ ప్రాంతంలో పర్యావరణం ప్రభావితం అవుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది.