అపవిత్రం... యుద్ద క్షేత్రాన్ని తలపిస్తున్న మానస సరోవర్... ఆగని చైనా దూకుడు...
మౌంట్ కైలాష్ సమీపంలో చైనా సైనిక సౌకర్యాల విస్తరణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో మొదలుపెట్టిన తాజా నిర్మాణాలతో పాటు ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణుల(SAM)ను మోహరించే ప్రక్రియ పూర్తయినట్లు తాజాగా వెలుగుచూసిన శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. చైనా మిలటరీ మోహరింపుతో హిందువులు పవిత్రంగా భావించే కైలాష్ మానస సరోవర్ ఇప్పుడు యుద్ద క్షేత్రాన్ని తలపిస్తోంది.
అగస్టు 16న వెలుగుచూసిన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే.. అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి HQ-9 SAM వ్యవస్థతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను మోహరించినట్లుగా స్పష్టమవుతోంది. అలాగే మూడు రాడార్ ర్యాంప్లతో నాలుగు లేదా ఎనిమిది SAM ట్రాన్స్పోర్టర్ ఎరేక్టర్ లాంచర్ల (TELs) కోసం నాలుగు ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసినట్లుగా ఆ చిత్రాల్లోని నమూనా సూచిస్తోంది. వీటితో పాటు మరో ప్రదేశంలో మూడు రాడార్లను చైనా మోహరించింది.
సాధారణంగా HQ-9 SAM వ్యవస్థ HT-233 రాడార్పై ఆధారపడి ఉంటుంది. ఫైర్ కంట్రోల్,సెర్చ్,ట్రాక్ టార్గెట్స్ కోసం రాడార్స్ పనిచేయనున్నాయి. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణుల(SAM)ను మోహరించిన ప్రదేశం భారత సరిహద్దులకు సరిగ్గా 90కి.మీ దూరంలో ఉంది.
గత మూడు నెలలుగా మౌంట్ కైలాష సమీపంలో కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు... తూర్పు హైవే వైపు మరో కి.మీ మేర ముందుకొచ్చాయి. ఇక్కడ కొత్త స్థావరాలను ఏప్రిల్ 11న మొదలుపెట్టిన చైనా... ఈ వారంలో వాటిని పూర్తి చేసింది.
1950 వరకూ ఈ ప్రాంతం భారత్ ఆధీనంలోనే ఉండేది. అక్కడి గ్రామాల నుంచి భారత్ పన్నులు కూడా వసూలు చేసింది. టిబెట్లో క్యాంపెయిన్తో చైనా క్రమంగా మౌంట్ కైలాష్,మానస సరోవర్,తూర్పు లదాఖ్ ప్రాంతాలను ఆక్రమించింది. భారత్ నుంచి మౌంట్ కైలాష్,మానస సరోవర్కు భారీగా తరలి వెళ్లే భారత యాత్రికులను నియంత్రించాలని చైనా చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ మార్గాలను తరుచూ మూసివేయడం,తెరవడం చేస్తూ వస్తోంది.
మానస సరోవర్,రక్షస్థల్.. ఈ రెండూ మౌంట్ కైలాష్ పరిక్రమలో భాగం. గత మే,జూన్ నెలల్లో చైనా విడుదల చేసిన వీడియోల్లో మానస సరోవర్ సహా ఆక్రమిత టిబెట్,భారత భూభాగాల్లో మిలటరీని మోహరించినట్లు కనిపిస్తోంది. భారతీయులు పవిత్రంగా భావించే మతపరమైన ప్రదేశాల్లో చైనా మిలటరీ కార్యకలాపాలను భారత్ తీవ్రంగా పరిగణించే అవకాశం కనిపిస్తోంది.