డ్రాగన్ నజర్: పాక్ ఎన్నికలపై చైనా కన్ను...డ్రాగన్ కంట్రీ మద్దతు ఎవరికో తెలుసా.?
పాకిస్తాన్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదేశ చిరకాల మిత్రదేశం అయిన చైనా జోక్యం ఎలా ఉండబోతోందనేది అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాకిస్తాన్లో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో ఇప్పుడప్పుడే ఎవరూ ఊహించలేకున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పట్ల కొంత సానుకూల పవనాలు వీస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి.
నవాజ్ షరీఫ్ ఆయన కుమార్తె మరియమ్ల అరెస్టులతో నవాజ్ సోదరుడు షెహెబాజ్ షరీఫ్ క్యాడర్ను కాపాడుకోవడంలో విఫలమైనందున అది ఇమ్రాన్కు లాభించిందని తెలుస్తోంది. గతంలో అంటే 2013లో నవాజ్ షరీఫ్ షెహబాజ్ షరీఫ్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వీరికి పట్టున్న పంజాబ్ ప్రావిన్స్లో 148 పార్లమెంటు స్థానాలకు గాను పీఎంఎల్ఎన్ పార్టీ 116 సీట్లు గెలుపొందింది.
ఇక చైనాతో సంబంధాల విషయానికొస్తే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చైనాకు మద్దతుగా నిలిచేందుకు సంకేతాలు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం వస్తే ఎప్పటిలాగే ఉన్న ఆర్థికవిధానాలనే అమలు చేస్తామని పరోక్షంగా చెప్పారు. అయితే బీజింగ్ మాత్రం పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత నవాజ్ షరీఫ్ సోదరుడు షెహెబాజ్ షరీఫ్తోనే మంచి సత్సంబంధాలు నెరిపింది. అంతేకాదు షెహబాజ్ సమర్థుడు అంటూ పలుమార్లు కొనియాడింది కూడా.
ఇదే క్రమంలో షెహెబాజ్ కూడా చైనాతో మంచి సంబంధాలనే మెయిన్టెయిన్ చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే 2013, 2016లో చైనాలో పర్యటించారు. షెహెబాజ్ పీఎంఎల్ అధ్యక్షుడిగా ఎన్నికవగానే చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సాంగ్ తావ్ అభినందనలు తెలుపుతూ లేఖ పంపారు. తమ చిరకాల మిత్రుడు, రెండు దేశాల మధ్య బంధాలు బలపడేందుకు కృషి చేసిన షెహెబాజ్కు అభినందనలు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ చైనాకు వ్యతిరేకం కాదంటూనే డ్రాగన్ కంట్రీ చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. సీపెక్ ప్రాజెక్టు పాకిస్తాన్కు చైనా అందిస్తున్న వరం అంటూ చెబుతూనే దీనివల్ల కొన్ని ప్రావిన్స్లకు నష్టం కలుగుతోందని...ముందుగా ఆ నష్టాన్ని పూడ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండంటూ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడు. పలుమార్లు తమ పార్టీ నిరసనలు కూడా చేపట్టింది. అయితే దీనిపై చైనా కాస్త అసంతృప్తితో ఉంది.
అందుకే రాజకీయంగాను పరిపాలనా పరంగానూ షరీఫ్ సోదరులకు అనుభవం ఉండటం ఇలాంటి పెద్ద ప్రాజెక్టులను షరీఫ్ సోదరులు ఇంతకుముందే చేపట్టారు కనుక వారికే చైనా మద్దతు పలుకుతోంది. చైనా తలుచుకుంటే పాకిస్తాన్లో లెక్కలు మారుతాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఎన్నికలపై దృష్టి సారించిందనే సమాచారం అందుతోంది. మరి పాలనపై అంతగా అనుభవం లేని ఇమ్రాన్ ఖాన్ డ్రాగన్ కంట్రీని, పాక్లో వస్తున్న ఎన్నికలను ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాల్సిందే.