చైనాకు మరో షాక్, బ్రిక్స్ విస్తరణకు భారత్ మోకాలడ్డు, పారని డ్రాగన్ పాచిక
చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం డోక్లామ్ లో పెట్టుకుని ఇప్పటికే దెబ్బ తిన్న చైనా మరోసారి భారత్ చేతిలో బ్రిక్స్ సాక్షిగా బోర్లాపడింది. బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం విషయంలో ఆ దేశం పరాభ
న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం డోక్లామ్ లో పెట్టుకుని ఇప్పటికే దెబ్బ తిన్న చైనా మరోసారి భారత్ చేతిలో బ్రిక్స్ సాక్షిగా బోర్లాపడింది. బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం విషయంలో ఆ దేశం పరాభవం పాలైంది.
కొత్త దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం కల్పించడం ద్వారా బ్రిక్స్ ప్లస్ కూటమిగా దాన్ని మార్చాలనేది చైనా ఆలోచన. అయితే ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుపడింది. దీంతో ఇక లాభం లేదనుకున్న చైనా బ్రిక్స్ విస్తరణ ఆలోచననే విరమించుకుంది.
బ్రిక్స్ లో ప్రాబల్యం పెంచుకోవాలని...
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమిలో తన ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్ మెల్లగా పావులు కదిపింది. తనకు సన్నిహితమైన దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని.. తద్వారా తన ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకోవాలని అది భావించింది. కానీ ఇందుకు భారత్ సహా ఇతర సభ్యదేశాలను ఒప్పించలేకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి బుధవారం తెలిపారు.
పైకి ఒకటి.. లోపల మరొకటి...
పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని మరింత దీటుగా ఎదుర్కోవడం కోసం బ్రిక్స్ కూటమిని విస్తరించాలని భావిస్తున్నట్లు చైనా పైకి చెబుతోంది. కానీ లోపల మాత్రం దాని ఉద్దేశం వేరే. తన వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం కోసమే డ్రాగన్ బ్రిక్స్ విస్తరణ నాటకానికి తెరతీసిందని భారత్ సహా ఇతర సభ్యదేశాలు గ్రహించాయి. దీంతో చైనా పాచికలు పారలేదు. సెప్టెంబర్ లో చైనాలోని జియామెన్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. సభ్యదేశాలు అంగీకరిస్తే.. అక్కడే కొత్త దేశాలను చేర్చుకోవాలని ఆలోచించిన డ్రాగన్, ఈ సదస్సులో పాల్గొనాలంటూ.. బ్రిక్స్ కూటమిలో ఇప్పటి వరకు సభ్యత్వం లేని ఐదు దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది.
2020 నాటికి ఆ మూడు దేశాల జీడీపీ...
తొలుత నాలుగు దేశాల కూటమిగా ఉన్న బ్రిక్లో సౌతాఫ్రికా చేరడంతో దాన్ని బ్రిక్స్గా మార్చారు. బ్రిక్స్ కూటమిలోని ఈ ఐదు దేశాల్లోనే ప్రపంచంలోని 40 శాతం జనాభా నివసిస్తోంది. 2020 నాటికి కేవలం బ్రెజిల్, చైనా, ఇండియా స్థూల దేశీయోత్పత్తి అమెరికా, ఐరోపా దేశాల జీడీపీని మించిపోయే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి గతంలో వెల్లడించింది. 2050 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ 128.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఒక్కో ఖండం నుంచి.. ఒక్కో దేశం...
ఈ సదస్సు కోసం ఒక్కో ఖండం నుంచి ఒక్కో దేశం చొప్పున.. థాయ్లాండ్, ఈజిప్ట్, తజికిస్థాన్, మెక్సికో, గినియాలకు చైనా ఆహ్వానం పంపింది. చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమంలో ఈ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే డ్రాగన్ అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు మాత్రం చైనా ఆహ్వానం పంపకపోవడం గమనార్హం. గతేడాది గోవాలో బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు.. భారత్ కూడా తన పొరుగు దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించింది.