చైనా బెదిరింపు ధోరణి: మా మీద వేలెత్తి చూపే ముందు ఒకసారి పునారాలోచించండి: డోర్ ఓపెన్
బీజింగ్: ప్రపంచాన్ని తలకిందులు చేసిన పారేసిన కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. చేసిన పనికి పశ్చాత్తాప పడినట్టూ కనిపించట్లేదు. పైగా బెదిరింపు ధోరణిని, తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి ఆదివారం విలేకరుల సమావేశంలో అనేక కీలక అంశాల గురించి మాట్లాడారు. తమ దేశ వైఖరి ఎలాంటిదో కుండబద్దలు కొట్టారు. కరోనా వైరస్ వల్ల మృతి చెందిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే పరోక్షంగా హెచ్చరికలనూ జారీ చేశారు.
ఎవ్వరైనా రావొచ్చు..
కరోనా వైరస్ తమ దేశంలోని వుహాన్లోని ల్యాబొరేటరీల్లో కృత్రిమంగా సృష్టించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కొన్ని దేశాలు డిమాండ్ చేస్తోన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము ఈ వైరస్ను కృత్రిమంగా సృష్టించలేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాము ఎలాంటి దర్యాప్తునైనా అంగీకరిస్తామని, ఎవ్వరితోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని అన్నారు. కరోనా వైరస్ జన్మరహస్యాన్ని కనిపెట్టడానికి ఏ దేశం వారైనా రావచ్చని స్పష్టం చేశారు.
వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దు..
కరోనా వైరస్ పుట్టుకకు తామే కారణమంటూ ఏ దేశం కూడా తమపై వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దని వాంగ్ యీ విజ్ఙప్తి చేశారు. అలాంటి ప్రయత్నం చేస్తే.. దాని ఫలితాలు చాలా దూరం వెళ్లొచ్చనీ పరోక్షంగా హెచ్చరించారు. అలా వేలెత్తి చూపే దేశాలు.. ముందు తమ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాము ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వాంగ్ యి స్పష్టం చేశారు. కరోనాను ల్యాబొరేటరీల్లో సృష్టించారనడంలో అర్థం లేదని కొట్టి పారేశారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని తేల్చి చెప్పారు.
మానవత్వాన్ని వైరస్ ఏమీ చేయలేదు..
తమ దేశ ఆత్మగౌరవాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా కొన్ని ప్రపంచ దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయని, వాటిని తాము తీవ్రంగా పరిగణించే అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు. ప్రపంచం మొత్తం ఈ వైరస్ బారిన పడటం, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులు కావడం, లక్షలాది మంది ప్రాణాలను కోల్పోవడం వంటి పరిణామాలు తమను కూడా బాధపెడుతున్నాయని వాంగ్ యి అన్నారు. ఈ వైరస్ మనుషులను చంపగలుగుతుందేమో గానీ మానవత్వాన్ని ఏమీ చేయలేదని చెప్పారు. అదే మానవత్వాన్ని ప్రతి ఒక్కరు తమ తోటి వారిపై చూపించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
Recommended Video
సరిహద్దులు దేశాల మధ్యే..
దేశాల మధ్య సరిహద్దులు ఉన్నప్పటికీ.. మనవత్వానికి అలాంటి అడ్డంకులు లేవని, తామంతా ఒకే భూగోళంపై నివసిస్తున్నామని అన్నారు. ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవాల్సిన పరిస్థితుల్లో నిరాధారమైన ఆరోపణలను చేయడం సహేతుకం కాదని వాంగ్ యి చెప్పారు. కరోనా వైరస్ తరువాత నెలకొనబోయే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడంపై తాము ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించినట్లు వాంగ్ యి తెలిపారు. తోటి దేశాలతో ఉద్రిక్త పరిస్థితులను తాము కోరుకోవట్లేదని అన్నారు. ఇదివరకట్లాగే దౌత్య సంబంధాలను కొనసాగించడానికే తాము ఆసక్తిగా ఉన్నామని స్పష్టం చేశారు.