వారికి పోటీగా చైనా ప్లాన్: గంటకు 1000 కి.మీ. వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైలు
బీజింగ్: చైనా విమానాలతో పోటీ పడే రైలును తయారు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గంటకు వెయ్యి కిలో మీటర్లు ప్రయాణించే రైలును 2025 వరకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది.
స్కేల్ మోడల్ ఆవిష్కరణ
దీనికి స్బంధించిన స్కేల్ మోడల్ను చైనా శుక్రవారం నాడు ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడగల, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును తీసుకు రావాలని తాము ప్రయత్నిస్తున్నట్లు ఈ మోడల్ ద్వారా చైనా తెలిపింది.
2015లో ప్రారంభం
చైనాలోని సౌత్ వెస్ట్ సిచౌహన్ ప్రావిన్స్లోని చెంగ్డు నగరంలో జరుగుతున్న 2018 నేషనల్ మాస్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ వీక్లో స్కేల్ మోడల్ రైలును ఆవిష్కరించింది. టీ ఫ్లయిట్ పేరుతో పిలుస్తున్న ఈ రైలు తయారీని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ 2015లో ప్రారంభించింది.
వెయ్యి కిలోమీటర్ల వేగంతో
ఈ రైలు గంటకు 1000 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ఇంత వేగంలోనూ ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా దీనిని నిర్మిస్తున్నామని చైనా ఏరో స్పేస్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ రైలు వేగం క్రమంగా పెరిగి గంటకు వెయ్యి కిలో మీటర్లు అవుతుందని చెప్పారు.
వాటికి పోటీగా
ప్రస్తుతం చైనాలో గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించే హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాకు చెందిన హైపర్ లూప్ వన్, హైపర్ లూప్ ట్రాన్సుపోర్టేషన్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు ఇప్పటికే హైస్పీడ్ టెక్నాలజీస్ పైన పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటికి పోటీగా ఈ రైలును చైనా తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.