ఇదెక్కడి న్యాయం: రంజాన్ మాసంలో ముస్లింల ఉపవాసంపై నిషేధం విధించిన ఆ దేశం
చైనా: రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో వారంతా ఉపవాస దీక్ష చేస్తారు. ప్రపంచంలో ఏమూలన ఉన్నా... దీక్ష మాత్రం చేపడతారు. ఇలాంటి పవిత్రమాసంలో చైనా అక్కడి ముస్లింలపై కఠిన నిర్ణయం తీసుకుంది. రంజాన్ వేళల్లో ఉపవాసం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మాయిలు ముసుగు ధరించటాన్ని నిషేధించిన కేరళ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ
వివాదాస్పదంగా మారిన రంజాన్ మాసం
పవిత్రమైన రంజాన్ మాసం చైనాలో వివాదాస్పదంగా మారింది. ముస్లింలు అత్యధికంగా ఉండే క్సింజియాంగ్ ప్రాంతంలో పనిచేసే ముస్లిం ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, టీచర్లు దీక్ష చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రంజాన్ మాసం సందర్భంగా అక్కడి రెస్టారెంట్లను తెరిచే ఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం చేస్తారు.
క్సింజియాంగ్ ప్రావిన్స్లో అత్యధికంగా నివసించే ముస్లింలు
చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సాధారణంగా కమ్యూనిస్టులు ఎక్కువగా నాస్తికులే ఉంటారు. ముస్లింలు అత్యధికంగా ఉండే క్సింజియాంగ్ ప్రావిన్స్లో రంజాన్ దీక్షలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఆ ప్రాంతంలో ఉయిఘర్ మైనార్టీలు ఎక్కువగా నివసిస్తారు. క్సింజియాంగ్ రాష్ట్ర అధికార వెబ్సైట్పై దీక్షలను నిషేధిస్తున్నట్లు పొందుపర్చింది. అంతేకాదు హోటళ్లు రెస్టారెంట్లు యధావిధిగా పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా రంజాన్ మాసంలో దీక్షలపై ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి ఆచారాలు వారికుంటాయని, ఎవరి మత విశ్వాసాలు వారికుంటుండగా ప్రభుత్వం పెత్తనమేంటని నాస్తికేతరులు ప్రశ్నిస్తున్నారు.
నిషేధంతో మతపరమైన గొడవలు
చైనా ప్రభుత్వం ఉపవాస దీక్షలపై నిషేధం విధిస్తుండటంతో అక్కడి ప్రజల మధ్య మతపరమైన గొడవలకు దారితీస్తోందని ఉయిఘర్ మైనార్టీ వారు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే విషయంపై ఘర్షణలు చెలరేగడంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్సింజియాంగ్ ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కారణం ముస్లింల మతవిశ్వాసం అక్కడ మితిమీరిపోతోందని అదే హింసకు దారితీస్తోందని చైనా అధికారులు చెబుతున్నారు. ఉపవాస దీక్షలపై నిషేధం విధించడం ద్వారా ముస్లిం సంస్కృతి నుంచి ఉయిఘర్స్ మైనార్టీలను దూరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉయిఘర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిల్క్సత్ రెక్సిట్ ధ్వజమెత్తారు. మతపరమైన దీక్షలపై నిషేధం విధిస్తూ విధానాలను రూపొందించడం వల్ల ఆ ప్రాంతంలో అస్థిరత్వం నెలకొని ఘర్షణలకు దారితీస్తుందని దిల్క్సత్ అభిప్రాయపడ్డారు.
చివరకు స్కూలు విద్యార్థులపై కూడా నిషేధం
గతంలో ఎప్పుడూ లేనంతగా... ఈసారి స్కూలు విద్యార్థులపై కూడా ఆంక్షలు విధించడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తరబాగతై నగరంలోని విద్యాశాఖ ఇప్పటికే అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉపవాసం ఉండరాదని, అదేసమయంలో వారిని మసీదుల్లోకి అనుమతించకూడదని, మతపరమైన కార్యక్రమాలకు హాజరుకాకుండా చూడాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది నగర విద్యాశాఖ. అంతేకాదు అధికారులు వచ్చి తనిఖీలను ముమ్మరం చేస్తారని అదే విషయాన్ని ఆ ప్రాంతంలోని ముస్లిం మతపెద్దలకు తెలిపారు. కజకిస్తాన్కు సరిహద్దులో ఉన్న గ్రామంలోని మసీదుకు ప్రత్యేకించి ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా మసీదులోకి ప్రార్థనలకోసం వస్తే వారు గుర్తింపు కార్డు విధిగా చూపించాలని ఆదేశాలిచ్చింది.