టార్గెట్ 2049... చైనా మిలటరీ స్ట్రాటజీ ఇదే... పాకిస్తాన్తో దోస్తీ,కీలక విషయాలు బహిర్గతం...
చైనా తమ సైనిక కార్యకలాపాలు(మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్) నిర్వహణ కోసం తమ చిరకాల మిత్రుడు పాకిస్తాన్తో దోస్తీ కట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మిలటరీ లాజిస్టిక్స్ విస్తరణ చేపట్టాలని చైనా భావిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ను కూడా ఒకటిగా చేర్చినట్లు పేర్కొంది.చైనా మిలటరీ&సెక్యూరిటీ డెవలప్మెంట్స్పై గత వారం అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో రక్షణ శాఖ ఈ విషయాన్ని పేర్కొంది. 200 పేజీల ఆ నివేదికలో చైనా భవిష్యత్ లక్ష్యాలను,విధానాలను కూలంకషంగా వివరించారు.
చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులు
టార్గెట్ 2049...
2049 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగేందుకు చైనా వ్యూహా రచన చేసినట్లు అమెరికా రక్షణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. చైనా అవలంభిస్తున్న సామాజిక,రాజకీయ విధానాల ద్వారా ఆ క్రమాన్ని అంచనా వేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ వేదికపై చైనాను బలమైన,సంపన్నమైన,పటిష్ట నాయకత్వం కలిగిన దేశంగా నిలిపేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(CCP) వ్యూహ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపింది. చైనా జాతీయ పునరుజ్జీవనానికి అనుకూలమైన బాహ్య పరిస్థితులను ఏర్పరచాలన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా విదేశాంగ విధానంలోనూ మార్పులకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే అమెరికాను మించిపోయిన చైనా
అమెరికా రక్షణ శాఖ నివేదిక ప్రకారం.. విదేశాంగ విధానంలో సాయుధ బలగాలు తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలని 2019లోనే చైనా ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి తగ్గట్లే చైనా ఎకనమిక్ డెవలప్మెంట్ పాలసీ మిలటరీ ఆధునీకీకరణకు మద్దతునిస్తోంది. యాక్టివ్ డిఫెన్స్(క్రియాశీలక రక్షణ యంత్రాంగం) అన్న వ్యూహం ఆధారంగా 2049 నాటికి శక్తివంతమైన ప్రపంచ శ్రేణి మిలటరీని ఏర్పరుచుకోవాలని చైనా భావిస్తోంది. ఇప్పటికే ఓడల నిర్మాణం,బాలిస్టిక్,క్రూయిజ్ క్షిపణులు,వాయు రక్షణ వ్యవస్థల ఆధునీకీకరణలో చైనా అమెరికాతో సమానత్వాన్ని సాధించిందని పేర్కొంది. అంతేకాదు,కొన్నింటిల్లో అమెరికాను మించిపోయినట్లు పేర్కొనడం గమనార్హం.
మిలటరీ లాజిస్టిక్స్ విస్తరణ... పాకిస్తాన్ సహా...
చైనా తమ ఆర్మీ,నేవీ,వాయు సేనలను మరింత బలోపేతం చేయడం కోసం ఓవర్సీస్ మిలటరీ లాజిస్టిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా నివేదిక తెలిపింది. మయన్మార్,థాయిలాండ్,సింగపూర్,ఇండోనేషియా,పాకిస్తాన్,శ్రీలంక,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,కెన్యా,టాంజానియా,అంగోలా,తజకిస్తాన్ దేశాల్లో మిలటరీ కార్యకలాపాల నిర్వహణ చేపట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా,దాని మిత్ర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ... పొరుగునే ఉన్న భారత్,భూటాన్ భూభాగాల దురాక్రమణకు తెగబడుతున్న క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓవర్సీస్లో చైనా మిలటరీ లాజిస్టిక్స్ విస్తరణను చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
వ్యూహాత్మక అడుగులు...
తమ జాతీయ వ్యూహానికి మద్దతుగా,చైనా తమ ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడం, ఇంధన భద్రతను పెంచడం, అంతర్జాతీయ ప్రభావాన్ని విస్తరించడం వంటి లక్ష్యాలను OBOR(వన్ బెల్ట్ వన్ రోడ్) ద్వారా చైనా సాధిస్తుంది. భద్రత మరియు అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు బెదిరింపులను తగ్గించడానికి పశ్చిమ,దక్షిణ అంచున ఉన్న ప్రాజెక్టుల్లో మరిన్ని పెట్టుబడులకు చైనా యోచిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్లో పైప్లైన్లు మరియు ఓడరేవు నిర్మాణంతో సంబంధం ఉన్న OBOR ప్రాజెక్టులు మలక్కా జలసంధి వంటి వ్యూహాత్మక చోక్ పాయింట్ల ద్వారా ఇంధన వనరులను రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది.