హెచ్చరిక: భారత సరిహద్దులో చైనా బలగాలు
వాషింగ్టన్: చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్థాన్లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది.
భారత సరిహద్దులకు దగ్గరలో చైనా తన సైనిక బలగాలను పెంచినట్లు తాము గమనించామని అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (తూర్పు ఆసియా) అబ్రహాం ఎం డెన్మార్క్ తెలిపారు.
చైనా సైనిక, భద్రతా బలగాలకు సంబంధించిన పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన వార్షిక నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన అనంతరం డెన్మార్క్ ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
అయితే చైనా ఏ ఉద్దేశంతో తన రక్షణ పాటవాన్ని, సైనిక బలగాల మోహరింపును పెంచుకుంటోందో అనే విషయంలో ఒక నిర్ధారణకు రావడం కష్టమని చెప్పారు. అంతేగాక, భారత్-చైనా వివాదాస్పద సరిహద్దుల వెంట బలగాలను మోహరించడం ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉందన్నారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్
మనదేశ సరిహద్దు వెంబడి సైనికులను మోహరిస్తూ చైనా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశ సరిహద్దు గ్రామాల ప్రజలకు మరో తలనొప్పి వచ్చి పడింది. భారత్-చైనా సరిహద్దు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు గత కొద్దిరోజుల నుంచి అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి.
అయితే ఈ కాల్స్ చైనా నుంచి వచ్చాయా? లేక పాకిస్థాన్ నుంచా? అనేది తెలియరావటం లేదు. వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి తాము సైనికాధికారులమని, లేదా ప్రభుత్వ అధికారులమని చెబుతూ.. సరిహద్దు గ్రామాల్లో ఉన్న భద్రత సిబ్బంది వివరాలను అడుగుతున్నారట.
సైనికులు సుమారు ఎంతమంది ఉంటారు? ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? తదితర ప్రశ్నలు అడుగుతున్నారని గ్రామస్థులు తెలిపారు. తాజాగా దర్బక్ గ్రామ సర్పంచ్కు కూడా ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చిందట. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఛాంగ్ లా, సంగేత్ గ్రామాల్లో పహారా కాస్తున్న ఆర్మీ సిబ్బంది వివరాలను గురించి అడిగారట.
అదీ ఆ గ్రామ సర్పంచ్ ఆర్మీ క్యాంప్లో ఉండగా అడగటంతో అవతలి వ్యక్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తి తాను డిప్యూటీ కమిషనర్ని అని చెప్పాడు.
దీంతో విచారణ ప్రారంభించిన ఆర్మీ అధికారులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఫోన్ చేయగా.. అలాంటి కాల్ ఏమీ తాము చేయలేదని చెప్పటం గమనార్హం. అప్రమత్తమైన అధికారులు.. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే దగ్గర్లో ఉన్న ఆర్మీ యూనిట్కు తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు.