సరిహద్దుల్లో చైనా మరో దుష్టపన్నాగం- భారత్-టిబెట్ బోర్డర్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం
గతేడాది లడఖ్ సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్పై ఆధిపత్యం కోసం ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తున్న చైనా తాజాగా మరో దుష్టప్రయత్నం చేస్తోంది. ఈసారి భారత్-టిబెట్ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్ రైలును ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో వేగంగా బలగాలు ప్రయాణాలు చేసేందుకు వీలు కలుగుతుంది.
టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్ ట్రైన్ను చైనా ప్రారంభించింది. టిబెట్లో ఇదే తొలి బుల్లెట్ ట్రైన్. అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించడం ద్వారా చైనా వ్యూహాత్మక అడుగు వేసినట్లయింది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు ఇకపై పరుగులు తీయబోతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది.
సిచువాన్-టిబెట్ రైల్వే టిబెట్లో నిర్మించిన రెండో రైలు మార్గం. గతంలో క్వింఘాయ్-టిబెట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. గతేడాది భారత్తో ఉద్రిక్తతలు తగ్గుతున్న తరుణంలో నవంబర్లో ఈ రైలు మార్గం ప్రారంభానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు ఇచ్చారు. అతికొద్దికాలంలోనే రైలు మార్గం అందుబాటులోకి రావడంతో పాటు బుల్లెట్ రైలు కూడా పరుగులు తీస్తోంది.
ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు గతంలో పట్టే 48 గంటల సమయం 13 గంటలకు తగ్గబోతోంది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు కీలక అడుగు కానుంది.