ట్రంప్ టాయిలెట్ రోల్స్: మేడిన్ చైనా, యుఎస్లో గిరాకీ
బీజింగ్: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చైనా వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ దేశం తమ దేశాన్ని రేప్ చేసిందని అన్నారు.
అంతేకాదు చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల పరంగా కూడా చైనా పైచేయి సాధిస్తోందని పేర్కొన్నారు.
చైనాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ దేశం పరోక్షంగా పగ తీర్చుకుంటుంది. డొనాల్డ్ ట్రంప్ పేరిట టాయిలెట్ టిష్యూ పేపర్లను ముద్రించి అమెరికా మార్కెట్లో విక్రయిస్తుంది. టాయిలెట్ పేపర్ రోల్స్పై వివిధ రూపాల్లో కూడిన ట్రంప్ ముఖచిత్రాలను ముద్రించింది.
ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలు ట్రంప్ ముఖచిత్రాలతో కూడిన టాయిలెట్ టిష్యూ రోల్స్ను ముద్రించి అమెరికా మార్కెట్ లోకి విడుదల చేశాయి. అంతేకాదు ఆ రోల్స్పై 'డంప్ విత్ ట్రంప్' అనే స్లోగన్ను కూడా ముద్రించాయి. ఈ టిష్యూ రోల్స్ వివిధ స్టైల్స్లో ఉండటంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి.
నవ్వుతున్నట్లు, బాధపడుతున్నట్లు, తలపట్టుకున్నట్లు, కోపంతో ఊగిపోతున్నట్లు వివిధ స్టిల్స్తో ఉన్న ట్రంప్ ముఖ చిత్రాలతో టిష్యూ రోల్స్ను ముద్రించినట్టు చైనా పత్రిక జిన్హువా పేర్కొంది. ట్రంప్ ముఖచిత్రంతో కూడిన టాయిలెట్ రోల్స్ను ఫిబ్రవరి నెలలో విపరీతంగా అమ్ముడు పోయాయని కింగ్ దావో వాల్ పేపర్ ఇండస్ట్రియల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోసారి ఐదువేల రోల్స్ కోసం 50 ఆర్డర్లు వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. ఇక చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా సుమారు చైనాకు చెందిన 70 తయారీదారులు రూపొందించిన టాయిలెట్ రోల్స్ను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచింది. అటు చైనాతో పాటు అమెరికాలో కూడా ట్రంప్ టాయిలెట్ రోల్స్కు యమ గిరాకీ ఉన్నట్టు ఓ నివేదికలో ద్వారా వెల్లడైంది.