వాళ్లను తరలించేస్తున్నారు: అక్కడో కొత్త నగరాన్ని నిర్మిస్తున్న చైనా..
రాజధాని బీజింగ్ నుంచి సుమారు 5లక్షల జనాభాను శివారు ప్రాంతానికి తరలించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
బీజింగ్: ఆధునికత తీసుకొచ్చిన అభివృద్ది మెగాసిటీల రూపంలో కేవలం సంపన్నులకు మాత్రమే సౌకర్యాలను కల్పించేదిగా తయారైంది. జనాభాలో ఎక్కువ శాతంగా ఉండే ప్రజలంతా అదే మెగాసిటీలల్లో మురికి కూపాల్లో మగ్గిపోతుంటారు.
చైనాలో పట్టణీకరణ అత్యంత వేగంగా విస్తరించిన తర్వాత మెగాసిటీలు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా కొంతమంది ప్రజలను వేరే చోటుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా రాజధాని బీజింగ్ నుంచి దాదాపు 3లక్షల నుంచి 5లక్షల మంది ప్రజలను ఖాళీ చేయించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
బీజింగ్ శివారులో జియాంగాన్ న్యూ ఏరియా పేరుతో మరో కొత్త నగరాన్ని నిర్మించి వీరిని అక్కడికి చేరుస్తారట. రాజధానిలో జనసాంద్రత పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు మౌలిక వసతుల కల్పన విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చైనా చెబుతోంది. ఈ కారణంతోనే కొంత జనాభాను ఇలా నగర శివారుకు తరలించాలని యోచిస్తోంది.
ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పలు పారిశ్రామిక సంస్థల ప్రధాన కార్యాలయాలను కూడా తరలించనుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే, చైనా కొత్తగా నిర్మిస్తున్న నగరం కూడా ఒకనాటికి 50లక్షల జనాభాకు చేరుకుంటుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ తమ నివేదికలో వెలువరించడం గమనార్హం.