చైనాలో ఇక అధికారికం: జనవరి 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: చైనాలో కుటుంబానికి ఒకే సంతానం విధానానికి స్వస్తి పలికారు. దేశ జనాభాను నియంత్రించడానికి 1970 దశకాల్లో తీసుకున్న నిబంధన వల్ల జనాభా సంక్షోభం ఏర్పడింది. అంతేకాదు పనిచేసే సామర్థ్యంగల యువత తగ్గిపోయారు. వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోయింది.
దీంతో దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన బిల్లుకు చైనా ప్రభుత్వం ఆమోదం లభించింది. జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇకపై చైనాలో ఒక జంట ఇద్దరు పిల్లలకు కనేందుకు అనుమతి ఇస్తూ చైనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం ఇంకాస్త ముందుగా తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ పాలసీని అక్టోబరులోనే చైనా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా కథనం ప్రకారం చైనా పార్లమెంటులో అత్యున్నత విభాగమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ నూతన చట్టాన్ని ఆమోదించింది.
గతేడాది విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం చైనాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 18.5 కోట్లు. జనాభాలో 13.7 శాతం వరకు వృద్ధులే. ఈ ఏడాది వీరిసంఖ్య 22 కోట్లు దాటింది. ఇందులో 5 కోట్లమంది వృద్ధులు పిల్లలకు దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదేతీరు కొనసాగితే వృద్ధుల జనాభా 2050 నాటికి 44 కోట్లకు చేరుకుంటుంది.
దీంతో వారి ఆలనాపాలనా చూసేవారెవరనేది పెద్ద సమస్యగా మారడంతో ఈ ఒకే బిడ్డ విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. అయితే వృద్ధుల జనాభా పెరుగుతుండటం, శ్రమచేయగలిగే వయోజనుల సంఖ్య తగ్గిపోవడం ఈ విధానపరమైన మార్పులకు కారణమని భావిస్తున్నారు. దీంతో పాటు మహిళా జనాభా గణనీయంగా పడిపోవడం కూడా మరో ముఖ్యకారణం.
1970 దశకంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా 130 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు దశాబ్దాలుగా కఠినంగా అమలు చేస్తున్న ఒకేబిడ్డ విధానం కారణంగా చైనాలో యువజనుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తిపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లింది.
చైనాలో ఒకే సంతానం పాలసీ ఇన్నాళ్లు అమల్లో ఉండటానికి కారణాలు అక్కడి పేదరికం, అధిక జనాభా. 14 ఏళ్లలోపు పిల్లల జనాభా ప్రపంచ సగటు 27 శాతం ఉండగా చైనాలో అది 16.5 శాతానికి పడిపోయింది. 16 నుంచి 59 సంవత్సరాల వయోవర్గానికి చెందిన పనిచేసేవారి సంఖ్య 2014లో 37 లక్షలు తగ్గిపోయింది.
చైనా జనాభాలో అధికసంఖ్యలో ఉన్న హాన్ జాతీయులకే కుటుంబ నియంత్రణ నిబంధనలు వర్తించనున్నాయి. చైనాలో 95 శాతం పైగా వీరే ఉంటారు. వీరి జనాభా పెరుగుదల హద్దులు దాటిపోయినందునే 70లలో కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టారు. మిగిలిన మైనారిటీ జాతుల వారికి మాత్రం జనాభా నియంత్రణ నిబంధనలు వర్తించవని ఒక ప్రకటనలో చైనా ప్రభుత్వం పేర్కొంది.