డ్రాగన్ కంట్రీ కుటిల బుద్ధి: ఉగ్రవాది మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చని చైనా
చైనా మరోసారి తన కుటిల బుద్దిని ప్రదర్శించింది. మోస్ట్ వాంటెడ్గా ఉన్న జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్న భారత్కు మరోసారి అడ్డుతగిలింది. మసూద్ అజర్కు మద్దతుగా డ్రాగన్ కంట్రీ నిలిచింది. అయితే మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటే ఏకాభిప్రాయం కుదరాలని అది భారత్ పాకిస్తాన్ల మధ్యనే ఏకాభిప్రాయం కుదరడం లేదంటూ తన వాదనలు వినిపించింది చైనా.
భారత్లో పలు దాడుల్లో ప్రధాన ముద్దాయిగా మసూద్ అజర్ ఉన్నాడు. 2016లో జమ్ముకశ్మీర్లో జరిగిన ఊడి ఘటనలో 17 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా మసూద్ అజర్ ఉన్నాడు. అయితే ఐక్యరాజ్యసమితిలో శాస్వత సభ్యత్వం ఉన్న చైనా... భారత్ ప్రయత్నాలకు గండికొడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండిలిలో సభ్యులుగా ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ చైనా ఇందుకు అడ్డుపడుతోంది. ఇప్పటికే మసూద్ అజర్ నడుపుతున్న జైషే మహ్మద్ సంస్థ యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉంది.
మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసేందుకు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదని చైనా వాదించింది. ఒకవేళ పాకిస్తాన్ భారత ప్రతిపాదనకు ఒప్పుకుంటే చైనా తప్పకుండా మద్దతు ఇస్తుందని డొంక తిరుగుడు సాకు యూఎన్ ముందు ఉంచింది. అంతేకాదు భారత్ పాక్లు ఒకే అభిప్రాయంతో ముందుకొస్తే మిగతా ప్రొసీజర్ను ముందుకు తీసుకెళతామని చైనా విదేశాంగా మంత్రి వాంగ్ తెలిపారు. ఇది చెబుతూనే భారత్తో చైనాకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. ఎవరినైనా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసేందుకు సరిపడ రుజువులు ఉండాలని... అది మసూద్ అజర్ విషయంలో రుజువులు లేవని పేర్కొంది. ఒకవేళ నిజంగానే రుజువులు ఉంటే దాన్ని ఎవరూ తోసిపుచ్చలేరని చైనా పేర్కొంది.