చైనా దుస్సాహసం: యుద్ధానికి సిద్ధం కావాలంటూ పీఎల్ఏకు జీ జిన్పింగ్ పిలుపు
బీజింగ్: భారత్-చైనా సరిహద్దులో గత కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశాధ్యక్షుడు జీ జన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ బేస్ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనంపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు భగ్గుమంటున్న తరుణంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మెరైన్ కార్స్స్ను ఉద్దేశించి ప్రసంగించారు.
Recommended Video
యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్
ఈ సందర్భంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ పీఎల్ఏకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ కథనం ప్రచరించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సిద్ధం కావాలి అని జిన్పింగ్ పిలుపునిచ్చట్లు పేర్కొంది.
చైనా తీరుపై క్వాడ్ దేశాల ఆగ్రహం..
వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నా చైనా తీరుపై అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే టోక్యోలో సమావేశమై డ్రాగన్ తీరును ఎండగట్టారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశాయి.
దళాల ఉపసంహరణకు ఓకేనంటూనే యుద్ధానికి కాలు దువ్వుతోంది..
అక్టోబర్ 2న 7వ కార్ప్స్ కమాండర్ లెవల్ మీటింగ్ తర్వాత చైనా, భారత్లు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పీఎల్ఏకు యుద్ధానికి సిద్దం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పిలుపునివ్వడం గమనార్హం. ఓ వైపు శాంతి చర్చలంటూనే మరోవైపు యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునివ్వడం చైనా దుస్సాహాసానికి నిదర్శనంగా తెలుస్తోంది.
లడఖ్, అరుణాచల్ను గుర్తించమంటూ చైనా పిచ్చికూతలు
కాగా, చైనా ఇటీవల భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లడఖ్ను భారత్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని తాము ఒప్పుకోమంటూ పిచ్చికూతలు కూసింది. పశ్చిమ, ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో 44 భారీ శాశ్వత వంతెనలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ వంతెనల్లో జమ్మూకాశ్మీర్లో 10, లడఖ్లో 8, హిమాచల్ ప్రదేశ్ లో 2, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్ 8, అరుణాచల్ప్రదేశ్ 8, సిక్కింలో 4 ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మరింత రెచ్చిపోయింది. లడఖ్, అరుణాచల్ప్రదేశ్ ప్రాంతాలను తాము గుర్తించమని చైనా పేర్కొంది. చైనాకు భారత్ ధీటుగా బదిలిచ్చింది. భారత అంతర్గాత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. ఇప్పటికే సరిహద్దు వెంట భారత్, చైనాలు భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఇప్పటికే భారత్ ప్రభుత్వం, సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.