మనకంటే చైనా బడ్జెట్ మూడు రెట్లు ఎక్కువ, అందుకే పెంచినట్లు ప్రకటన
బీజింగ్: తమ రక్షణ బడ్జెట్ 8.1 శాతం పెంచినట్లు చైనా సోమవారం ప్రకటించింది. గత రెండేళ్ల కంటే ఇది ఎంతో ఎక్కువ. మన దేశం కంటే మూడు రెట్లు ఎక్కువ. గత ఏడాదితో పోలిస్తే చైనా తన బడ్జెట్ను 8.1 శాతానికి పైగా పెంచింది.
1.11 ట్రిలియన్ యువాన్లు అంటే 175 బిలియన్ డాలర్లను రక్షణ రంగానికి కేటాయించినట్లు చైనా తెలిపింది. గత ఏడాది రక్షణ బడ్జెట్ను ఏడు శాతం పెంచిన చైనా, ఇప్పుడు 8.1 శాతం పెంచింది.
అమెరికా తర్వాత చైనా
ప్రపంచంలోనే అమెరికా తర్వాత రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న దేశం చైనా. అమెరికా రక్షణ బడ్జెట్ 602.8 బిలియన్ డాలర్లు. భారత్ 52.5 బిలియన్ డాలర్లు కేటాయించింది. చైనా గత ఏడాది రక్షణ రంగానికి 150.5 బిలియన్ డాలర్లు కేటాయించింది.
ఇలా విస్తరించుకుంటోంది
చైనా రెండు కొత్త విమాన వాహక నౌకలను రూపొందిస్తోంది. ఇప్పటికే ఒక విమాన వాహన నౌక సేవలు అందిస్తోంది. అలాగే కొత్తగా జే 20 యుద్ధ విమానాలు సహా మరికొన్ని కొత్త జెట్లను తయారు చేస్తోంది. చైనా నౌకాదళ సేవలను కూడా విస్తరించుకుంటోంది.
జీడీపీలో రక్షణ బడ్జెట్ ప్రభావం తక్కువ
గత రెండేళ్లతో పోలిస్తే రక్షణ బడ్జెట్ను కొద్దిగా పెంచామని చైనా అధికార మీడియా తెలిపింది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే చైనా జీడీపీలో రక్షణ బడ్జెట్ ప్రభావం తక్కువగా ఉందని, జాతీయ ఆర్థిక వ్యయం కూడా తక్కువగా ఉందని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
ఇందుకోసం పెంచాం
మిలిటరీ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేయడానికి, సైనికులు, మహిళల సంక్షేమం, కిందిస్థాయి దళాల నివాస, శిక్షణ పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు బడ్జెట్ను పెంచినట్లు తెలిపారు.