పాకిస్తాన్ సరికొత్త కుట్ర: అటు నుంచి నరుక్కొస్తున్న వైనం: భారత్ అప్రమత్తం!
న్యూఢిల్లీ: శతృవుకు శతృవు మిత్రుడవుతాడనేది యుద్ధ నీతి. ప్రస్తుతం ఈ సూత్రాన్నే అనుసరిస్తోంది పాకిస్తాన్. భారత్ ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తనకు లేవని గ్రహించిన పాకిస్తాన్.. ఆసియాలో మరో బలమైన దేశం చైనాను తోడు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. సైనిక పరంగా, ఆర్థికపరంగా భారత్ కంటే బలమైన దేశంగా చైనాను గుర్తిస్తోన్న పాకిస్తాన్.. ఆ దేశాన్ని తన దారిలోకి తెచ్చుకోనుంది. ఇందులో భాగంగా- పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో చైనా అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) ఉపాధ్యక్షుడు జనరల్ గ్జు క్విలాంగ్ పాకిస్తాన్ కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలన్నింటితో భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్, చైనా మధ్య కొనసాగుతున్న అత్యున్నత స్థాయి సమావేశాలను గమనిస్తోంది.
వైఎస్ జగన్ డ్రీమ్: మరో నాలుగురోజుల్లో కార్యరూపం: ఎప్పుడు..ఏ జిల్లాలో? ట్రయల్ రన్..సక్సెస్
ఇమ్రాన్ తో భేటీ మతలబేంటీ?
చైనా రక్షణశాఖలో అత్యున్నత విభాగం సెంట్రల్ మిలటరీ కమిషన్. జనరల్ గ్జు క్విలాంగ్.. దీనికి ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం వారిద్దరి మధ్యే చోటు చేసుకోవడం అత్యంత ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తోంది. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు చేయడం, తదనంతరం ఆ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా క్విలాంగ్ కు వివరించినట్లు పాకిస్తాన్ మీడియా స్పష్టం చేస్తోంది. అనంతరం ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చకు వచ్చిన అంశాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించినట్లు వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్, లడక్ పూర్తిగా భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
మానవ హక్కులను హరించేలా
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్తాన్ మొసలి కన్నీరు కారుస్తోందనే విమర్శలు మనదేశంలో వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇంట్లోనే బందీలు అయ్యారని, స్వేచ్ఛగా బయటికి తిరగలేని పరిస్థితులను భారత ప్రభుత్వం కల్పించిందని క్విలాంగ్ తో భేటీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాశ్మీరీ ప్రజలను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టేసిందని, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని, మానవ హక్కులను కాలరాసిందని ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని, రాజకీయ ప్రత్యర్థులను ఎవ్వరినీ ఆ రాష్ట్రంలో పర్యటించకుండా నిషేధించిందని వివరించారు. భారత వైఖరిపై క్విలాంగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో తాము సంపూర్ణ మద్దతు అందిస్తామని ఆయన ఇమ్రాన్ ఖాన్ కు భరోసా ఇచ్చారట.
లడక్ భూభాగంపై
చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న లడక్ ను కేంద్రప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్.. క్విలాంగ్ దృష్టికి తీసుకుని రాగా.. ఆ విషయంలో తాము భారత్ చర్యల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడించరాని పాక్ మీడియా తెలిపింది. ప్రస్తుతం చైనా ఆక్రమిత ప్రాంతమైన అక్సాయ్ చిన్ ను సైతం తాము స్వాధీనం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడాన్ని క్విలాంగ్ తప్పు పట్టినట్లు చెబుతున్నారు. లడక్ వైపు నుంచి భారత్ పై ఒత్తిడిని తీసుకుని వచ్చేలా పాకిస్తాన్ సరికొత్త వ్మూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం వేస్తోన్న ప్రతి అడుగు కూడా లడక్ వైపే పడుతోంది. చైనా సహకారంతో లడక్ పరిధిలోని వివాదాస్పద ప్రాంతమైన అక్సాయ్ చిన్ ను కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ కుట్ర పన్నుతున్నట్లు సమాచారం.