ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం: పాక్ను అడ్డం పెట్టిన చైనా
మనస్సు మార్చుకునేందుకు నిరాకరిస్తున్న చైనా.. ప్రపంచ దేశాలన్నీ సరే అంటున్నా, తాను మాత్రం అందుకు ససేమిరా అంటున్నది.
న్యూఢిల్లీ: మనస్సు మార్చుకునేందుకు నిరాకరిస్తున్న చైనా.. ప్రపంచ దేశాలన్నీ సరే అంటున్నా, తాను మాత్రం అందుకు ససేమిరా అంటున్నది. దీనికి పాకిస్థాన్తో ఆ దేశానికి ఉన్న వ్యూహాత్మక బంధమే కారణమని అంటున్నారు.
48 దేశాల బలమైన కూటమైన న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారతదేశానికి సభ్యత్వాన్ని కల్పించే అంశంపై ఈ నెలలో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో జరగనున్న సమావేశంలోనూ చైనా అడ్డంకులు సృష్టించనున్నదని స్పష్టంగా తేలిపోయింది.
గత ఏడాది సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేస్తే.. దానికి పోటీగా పాకిస్థాన్తో ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయించింది. భారతదేశానికి సభ్యత్వం లభించే అవకాశం గతానికంటే ఇంకా సంక్లిష్టంగా తాజాగా చైనా సహాయ విదేశాంగ మంత్రి లీ హులాయ్ వ్యాఖ్యానించటంతో ఆ దేశం అభిమతమేమిటో తెలిసిపోతోంది.
ఏకగ్రీవంతోనే ఎన్ఎస్జీలో సభ్యత్వం
ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారతదేశం గత ఏడాది మే నెలలో దరఖాస్తు చేసింది. దీనిపై ఇప్పటికే రెండు దఫాలు చర్చ జరగ్గా చైనా వ్యతిరేకించింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలంటే ఎన్ఎస్జీ గవర్నింగ్ బాడీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటేనే సాధ్యం. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా కుదరదు. అందుకే ఇంతకాలం భారతదేశానికి సభ్యత్వం లభించలేదు. పాకిస్థాన్తో చైనా బంధం ఇటీవలి కాలంలో బలపడుతున్న సంగతి తెలిసిందే. చైనా- పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ రూపంలో పాకిస్థాన్కు చైనా అవసరం కంటే, చైనాకే పాకిస్థాన్ అవసరం ఇప్పుడు ఎక్కువ అయింది. పాకిస్థాన్ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిన పరిస్థితి చైనాకు ఎదురైంది. దీంతో భారతదేశానికి ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంతో తన మొండి పట్టుదల వీడటం లేదు.
జీ జిన్పింగ్తో ప్రధాని మోదీ
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఈ నెల 8,9 తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో పరిశీలక హోదాలో ఉన్న భారత్, పాకిస్థాన్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలిసే అవకాశం ఉన్నది. ఎన్ఎస్జీ సభ్యత్వ విషయం ఇరువురి మధ్య చర్చల్లో ప్రస్తావనకు రావచ్చు. కానీ ఈలోపే చైనా అధికార వర్గాలు భారతదేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించే విషయంలో వ్యతిరేకంగా వ్యాఖ్యానించటాన్ని బట్టి చైనా మెట్టు దిగి రాలేదని అర్ధం చేసుకోవచ్చు. గతంలోనూ ఎన్ఎస్జీ సమావేశానికి ముందు జీ జిన్పింగ్ను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ సభ్యత్వాన్ని అడ్డుకోవద్దని కోరిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా చైనా సానుకూలంగా స్పందించలేదు. ఈ సారి స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.
సొంత అణు ఇంధన తయారీకే భారత్ ప్లాన్
వచ్చే రెండేళ్లలో ఎన్ఎస్జీ సభ్యత్వం పొందే విషయమై సొంతంగా అణు ఇంధన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన భారతదేశానికి ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటీ 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పది అణు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఇందుకు అవసరమైన రియాక్టర్లు, సాంకేతిక పరిజ్ఞానం లభించని పక్షంలో సొంతంగా రియాక్టర్లు తయారుజేసి వాటిని వినియోగించే అవకాశం ఉన్నది. అదే జరిగితే భారతదేశానికి రియాక్టర్లు సరఫరా చేసే రష్యా, ఫ్రాన్స్, అమెరికా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది.
చైనాపై ఒత్తిడికి ఇలా
భారతదేశంలో ప్రస్తుతం 22 అణు విద్యుత్ కేంద్రాల్లో 6,780 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. నిర్మాణంలో ఉన్న మరో 6700 మెగావాట్ల సామర్థ్యం 2022 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎన్ఎస్జీ తదుపరి సమావేశం ఈ నెలలో జరగనున్నది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ దీనికి వేదిక. ఈ సమావేశంలో ఇతర అంశాలతో పాటు భారత్కు సభ్యత్వం కల్పించే అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు. భారతదేశం ఒకవైపు తన వంతుగా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క చైనా తన అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా ఇతరదేశాలతో ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఇందుకు అమెరికా, రష్యా తమ పరపతిని వినియోగించాలని కోరుకుంటోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.
ఎన్ఎస్జీ సభ్యత్వానికి నేపథ్యం
సభ్యత్వం లభిస్తే అధికారికంగా ఇతరదేశాల నుంచి అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోవచ్చు. పౌర అణు విద్యుత్ కేంద్రాలను రక్షణ అవసరాలకు కూడా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అనధికారికంగా భారత్ను అణుశక్తి సంపన్న దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించినట్లు అవుతుంది. అధికారికంగా అణ్వస్త్ర శక్తిగల దేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లకు మాత్రమే అవకాశం ఉన్నది. భారతదేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించటం ఇతరదేశాలకు సైతం మేలు చేసేదే. ఎంతో వేగంగా విస్తరిస్తుందని భావిస్తున్న భారత అణు ఇంధన వ్యాపారంలో పాలుపంచుకునే అవకాశం ఇతర దేశాలకు లభిస్తుంది.
ఇందుకే చైనా అడ్డంకి
అణు సరఫరాదార్ల బృందం (ఎన్ఎస్జీ) లోని ప్రధాన సభ్య దేశాలన్నీ భారతదేశ సభ్యత్వానికి సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్ తదితర పెద్ద దేశాలు ఇప్పటికే బహిరంగంగా భారత్కు మద్దతు తెలిపాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని మొండికేస్తున్న దేశం చైనా ఒక్కటే. పైగా భారతదేశానికి ఎక్కడ సభ్యత్వాన్ని కట్టబెడతారోననే భయంతో పాకిస్థాన్ చేత తనకూ సభ్యత్వం కావాలని ఎన్ఎస్జీకి దరఖాస్తు చేయించింది. ఇస్తే రెండు దేశాలకూ ఇవ్వాలనేది చైనా భావన. తద్వారా తనకు వ్యూహాత్మక అవసరాలు ఉన్న పాకిస్థాన్ను ఆదుకున్నట్లు అవుతుందని భావిస్తోంది.