ట్రంప్ కు డ్రాగన్ షాక్- సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని ప్రకటన..
ప్రపంచ వ్యవహారాల్లో పద్దన్న పాత్రను పోషించే అమెరికాకు భారత్, చైనా ఒకరి వెంట ఒకరు షాక్ ఇచ్చాయి. సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనంటూ ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత భారత్ తోసిపుచ్చగా.. ఆ తర్వాత చైనా కూడా ఇదే తరహాలో స్పందించింది. సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇరుదేశాలూ కోరుకోవడం లేదని చైనా విదేశాంగశాఖ తేల్చిచెప్పింది. దీంతో ఇండో-చైనా వివాదంలో దూరాలనుకున్న ప్రపంచ పెద్దన్న అమెరికాకు భారీ షాక్ తగిలినట్లయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్ పై తొలిసారిగా స్పందించిన చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్, ఇరుదేశాల సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలో మూడో వ్యక్తి జోక్యం కోరుకోవడం లేదన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారాలకు ఇరుదేశాలకూ తగిన వ్యవస్దలు ఉన్నాయన్నారు. భారత్ తో చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం ఎలాగో తమకు తెలుసన్నారు.
Recommended Video
లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ -ఎల్ఏసీతో పాటు ఉత్తర సిక్కింలోని సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల మధ్య బాహాబాహీ చోటుచేసుకున్న నేపథ్యంలో ఇరుదేశాలూ యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా బలగాలు సాధారణ పెట్రోలింగ్ ను దాటి దూసుకొస్తున్నందున ఉద్రిక్తతలు పెరుగతున్నట్లు భారత్ తాజాగా ప్రకటించింది. సరిహద్దు వివాదాల విషయంలో భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, అదే సమయంలో దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే చూస్తూ ఊరుబోబోదని విదేశాంగశాఖ కూడా పేర్కొంది.