భారత్పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ అక్కసు: జో బైడెన్ గెలిస్తే హంతకులు దేశంలోకి అంటూ ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే చైనాను బూచిగా చూపిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా, చైనాతోపాటు రష్యా, భారత్లపై తన అక్కసును వెల్లగక్కాడు.
కరోనావైరస్ బారిన ట్రంప్ చిన్న కొడుకు బారన్ ట్రంప్, వివరాలను వెల్లడించిన మెలానియా
భారత్ సహా ఆ మూడు దేశాలే కాలుష్యానికి కారణం..
ప్రపంచ వాయు కాలుష్యానికి చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలే కారణమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే, అమెరికా మాత్రం పర్యావరణ రక్షణలో ముందుందని తెలిపారు. నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. తన పరిపాలనలో యుఎస్ తన సహజమైన వాతావరణాన్ని కాపాడుకుంటూ శక్తి స్వాతంత్య్రాన్ని సాధించిందన్నారు. ‘మనం ఉత్తమ పర్యావరణ సంఖ్యలు, ఓజోన్ సంఖ్యలు, మరెన్నో సంఖ్యలు ఉన్నాయి. ఇదే సమయంలో, చైనా, రష్యా, భారతదేశం లాంటి దేశాలన్నీ గాలిలోకి కాలుష్యాన్ని చొప్పిస్తున్నాయి' ట్రంప్ ఆరోపించారు. అమెరికా తన సహజమైన వాతావరణాన్ని పరిరక్షించుకుంటూ ఇంధన స్వాతంత్య్రాన్ని సాధించింది' ట్రంప్ పునరుద్ఘాటించారు.
అమెరికాకే నష్టం: ప్యారిస్ ఒప్పందంపై ట్రంప్ ఇలా..
ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ట్రంప్ 2017 జూన్లో ప్రకటించారు, ఈ ఒప్పందం వల్ల అమెరికాకు ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయని, ఉద్యోగాలు పోతాయని, చమురు, గ్యాస్, బొగ్గు, తయారీ పరిశ్రమలకు ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. ఇప్పుడేమో ఇతర దేశాలపై నెపం నెడుతుండటం గమనార్హం. అంతేగాక, పారిస్ ఒప్పందం నుండి చైనా, భారతదేశం వంటి దేశాలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయని, ఈ ఒప్పందం అమెరికాకు అన్యాయమని, ఎందుకంటే ఇది తన వ్యాపారాలను, ఉద్యోగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.
చైనా, రష్యా, భారత్లే ప్రపంచానికి కాలుష్యాన్నిస్తున్నాయి..
గురువారం ర్యాలీలో కూడా ట్రంప్ తన మద్దతుదారుల కేరింతల మధ్య మాట్లాడుతూ.. ప్రపంచ కాలుష్యానికి కొన్ని దేశాలు దోహదం చేస్తున్నాయని అన్నారు. తాను స్వచ్ఛమైన గాలినే కోరుకుంటానని చెప్పారు. చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు మాత్రం గాలి కాలుష్యాన్ని చేస్తూ ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని ఆరోపించారు.
అంతేగాక, ప్లాస్టిక్ బదులు పేపర్ వాడాలని పిలుస్తున్నవారిని కూడా ట్రంప్ ఎగతాళి చేశారు. ప్లాస్టిక్ స్ట్రాలు, ప్లేట్లు, కార్టన్స్ వాడుతున్నారుగా? అని ప్రశ్నించారు.
అమెరికాన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. అంతేమరి
ఇటీవల టెన్నెస్సె వ్యాలీ అథారిటీ ఛైర్మన్ను తొలగించానని చెప్పారు. ఎందుకంటే అతడు అమెరికన్లను ఉద్యోగులను తొలగించి.. ఇతర దేశాలకు చెందినవారికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. తాను ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత.. తిరిగి అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. తాను స్వదేశంలో అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు.
Recommended Video
జో బైడెన్ గెలిస్తే హంతకులు దేశంలోకి అంటూ ట్రంప్ సంచలనం
ఇక తన ప్రత్యర్థి జో బైడెన్పైనా ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ ఇమ్మిగ్రేషన్ ప్రణాళిక దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైనదని ట్రంప్ ఆరోపించారు. జో బైడెన్ అధికారంలోకి వస్తే హంతకులు దేశంలోకి చొరబడతారని, అనేక మందిని చంపుతారని ఆరోపించారు. కాగా, జో బిడెన్ బుధవారం తన ర్యాలీలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.