ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చైనా జలవిద్యుత్ కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం మంగళవారం నుంచి పనిచేయడం ప్రారంభించింది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై పొరుగు దేశం చైనా ఓ భారీ డ్యాంను నిర్మించింది.
ఆ డ్యాంకు దిగువ భాగాన జామ్ అనే జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యాంకు చైనా సుమారు 1.5 బిలియన్ డాలర్లు (9700 కోట్లు) వెచ్చించింది. ఈ డ్యాంపై గత కొంతకాలంగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
అయినప్పటికీ భారత్ ఆందోళనను పట్టించుకోకుండా చైనా మంగళవారం జామ్ హైడ్రోపవర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇక బ్రహ్మపుత్ర నది విషయానికి వస్తే టిబెట్ నుంచి భారత్లో ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది.
టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో డ్యాంలను నిర్మిస్తే అది భారత్లోని దిగువ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంటుందని భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే అవేమి పట్టించుకోకుండా చైనా మంగళవారం జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది.
బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఎక్కువైనప్పుడు చైనా నీటిని వదిలితే కింది దిగువ ప్రాంతాలు ముంపునకు గురవతాయని, దీని వల్ల తీవ్ర ప్రమాదం ఉంటుందని భారత్ ఈ డ్యాంను నిర్మించడాన్ని వ్యతిరేకించింది.