చైనా అమ్ముల పొదిలో హైపర్ సోనిక్ క్షిపణి: ఇండియా, జపాన్ టార్గెట్?
బీజింగ్: అత్యంత సూటిగా, వేగంగా లక్ష్యాలను చేధించే హైపర్ సోనిక్ క్షిపణిని చైనా తయారు చేసింది. రెండు దఫాలు ఈ క్షిపణిని చైనా పరీక్షించింది. ఈ క్షిపణి విజయవంతంగా పనిచేస్తోందని తేలింది.అయితే ఇండియా, జపాన్ లక్ష్యంగా చేసుకొని చైనా ఈ క్షిపణిని తయారు చేసిందనే ప్రచారం కూడ లేకపోలేదు.
హైపర్ సోనిక్ క్షిపణి డీఎఫ్-17 చైనా అమ్ములపొదిలో చేరింది.గత ఏడాది నవంబర్ 1వ, తేదిన తొలిసారిగా ఈ క్షిపణిని పరీక్షించింది చైనా, వారం రోజుల తర్వాత మరోసారి ఈ క్షిపణిని పరీక్షించింది.
జపాన్లోని కొన్ని కీలక ప్రాంతాలను కూడా ఇది ఛేదించనుంది. ఈ హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్ (హెచ్జీవీ)ని 2020 నాటికి సైన్యంలోకి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగోలియాలోని జియాక్యువాన్ ప్రాంతంలో క్షిపణిని పరీక్షించారు.
ఖండాంతర క్షిపణుల కంటే వేగంగా, తక్కువ ఎత్తులో ఇవి ప్రయాణించడం వల్ల నిఘా విమానాలకు ఇవి చిక్కే అవకాశం లేదు. పరీక్ష దశలో ఇది గంటకు 1400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
భారత్, జపాన్ దేశాల్లోని లక్ష్యాలను ఇవి ఛేదించే అవకాశం ఉండడంతో ఈ రెండు దేశాలకు వీటితో ముప్పు పొంచి ఉన్నట్టే. ఈ క్షిపణిని ఇంటర్సెప్టర్ క్షిపణులు కూడా అడ్డుకోలేవని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.