అంగుళం కూడా వదులుకోం, మిలటరీ వెనక్కి తగ్గలేదు: చైనా సంచలన వ్యాఖ్యలు
చైనా దేశ సర్వాధికారాలను కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ తెలిపారు.
బీజింగ్: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో డోక్లాం వివాదంలో కవ్వింపు చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టిన చైనా.. తిరిగి పాత వైఖరినే అవలంభిస్తోందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దులోని ప్రతి అంగుళంలో సైనిక, రక్షణ బలగాలను మోహరిస్తామని తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం గమనార్హం.
చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?
చైనా దేశ సర్వాధికారాలను కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ తెలిపారు. వివాదంపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు డోక్లాంలో మిలటరీ తన పని తాను చేసుకుపోతుందంటూ రెన్ పేర్కొన్నారు. దీన్నిబట్టి డోక్లాం నుంచి చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా జరిగిన ప్రచారం వట్టిదేనని తెలుస్తోంది.
చైనా బలగాలు వెనక్కి తగ్గాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పు పట్టడం దీనికి బలం చేకూరుస్తోంది. డోక్లాంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి చైనా సిద్దంగా లేదని, వివాదం ప్రారంభమైన నాటి నుంచి డోక్లాంపై చైనా మిలటరీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. అయితే భారత మిలటరీతో చైనా మిలటరీ చర్చలకు సిద్దంగా ఉందని, ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామన్న తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారు.