China Mars Mission:అంగారకుడి కక్ష్యలోకి చైనా స్పేస్ క్రాఫ్ట్: ఎలాంటి పరిశోధనలు చేస్తుంది..?
అంతరిక్ష రంగంలో చైనా మరో ముందడుగు వేసింది. అంగారక గ్రహం కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ను పంపింది. . అంగారకుడిపై భూగర్భ జలాలను సేకరించడం, అక్కడ పూర్వం ఏమైనా జీవరాశులు ఉండేవా అన్న సమాచారంను రోవర్ ద్వారా సేకరించనుందని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భూమి నుంచి టేకాఫ్ తీసుకున్న ఏడు నెలలకు అంగారకుడి కక్ష్యలోకి అంతరిక్ష నౌక ప్రవేశించిందని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అంగారకుడి కక్ష్యలో మూడు దేశాల స్పేస్ క్రాఫ్ట్లు
చైనా రోవర్ కంటే ముందు అనగా మంగళవారం రోజున యూఏఈకి చెందిన మరో స్పేస్ క్రాఫ్ట్ అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. వచ్చే వారం అమెరికాకు చెందిన రోవర్ అంగారకుడిపై ల్యాండ్ కానుంది. ఇప్పటి వరకు అమెరికా దేశంకు చెందిన స్పేస్ క్రాఫ్ట్లు మాత్రమే ఎనిమిది సార్లు అంగారకుడిపై ల్యాండ్ అయ్యాయి.ఈ రోజు ల్యాండర్ మరియు రోవర్లు అక్కడ ఆపరేట్ అవుతున్నాయి. ఈ మూడు దేశాలకు చెందిన స్పేస్క్రాఫ్ట్లు గతేడాది జూలైలో భూమి నుంచి టేకాఫ్ తీసుకున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి అంగారక గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది. దీంతో మరిన్ని విషయాలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
స్పేస్ క్రాఫ్ట్ నుంచి వేరుపడనున్న రోవర్
ఇక ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన చైనా స్పేస్ క్రాఫ్ట్ అనుకున్నట్లుగానే అంతా సవ్యంగా జరిగితే మరికొన్ని నెలల్లో రోవర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వేరుపడి అంగారకుడిపై ల్యాండ్ అవుతుంది. అంతా సవ్యంగా సాగితే అంగారకుడిపై ల్యాండ్ అయిన రెండో దేశంగా చైనా రికార్డు సృష్టిస్తుంది. ఇక తియాన్వెన్గా పిలువబడుతున్న తియాన్వెన్ అంటే స్వర్గానికి చేరుకునే మార్గాన్వేషణ అని అర్థం. ఇదిలా ఉంటే అంగారకుడి పై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయించడం అంత సులభమైన పనికాదు. అయితే చైనా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పారాషూట్, బ్యాక్ ఫైరింగ్ రాకెట్స్, ఎయిర్ బ్యాగ్స్లు అమర్చారు. 1976లో అమెరికా స్పేస్ క్రాఫ్ట్ వికింగ్ ఎక్కడైతే ల్యాండ్ అయ్యిందో అక్కడే చైనా స్పేస్ క్రాఫ్ట్ను కూడా ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు.
ల్యాండ్ కానున్న అమెరికా స్పేస్ క్రాఫ్ట్
గోల్ఫ్ కార్ట్ సైజులో ఉన్న రోవర్ సోలార్ పవర్తో పనిచేస్తుంది. రోవర్ మూడు నెలల పాటు పనిచేయనుండగా... ఆర్బిటార్ రెండేళ్లు పాటు పనిచేస్తుంది.ఇదిలా ఉంటే అమెరికా స్పేస్ క్రాఫ్ట్ ఫిబ్రవరి 18న మార్స్ గ్రహంపై ల్యాండ్ కానుంది.అక్కడ పురాతన సూక్ష్మ జీవుల గురించి సమాచారం సేకరించి, రాళ్లను కూడా భూమికి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక యూఏఈ పంపిని అమల్ అనే ఆర్బిటర్ మంగళవారం రోజునుంచే అంగారకుడి వాతావరణ పరిస్థితులపై సమాచారం సేకరించే పనిలో పడింది. అంగారకుడి గ్రహంకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ఇప్పటికే మూడు అమెరికా, రెండు యూరోపియన్ , ఒకటి భారత్కు చెందిన ఆర్బిటర్లు చక్కర్లు కొడుతున్నాయి.
చైనాది రెండో ప్రయత్నం
అంగారకుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ను పంపడం చైనాకు ఇది రెండోసారి కావడం విశేషం. 2011లో జరిగిన తొలి ప్రయత్నంలో రష్యా చేసిన ప్రయోగంలో చైనా ఆర్బిటర్ కూడా భాగస్వామ్యంగా ఉన్నింది. అయితే అది భూకక్ష్యను దాటడంలో విఫలమైంది. ఇక అప్పటి నుంచి చైనా మిలటరీ సంబంధిత అంతరిక్ష పరిశోధనలను అతి రహస్యంగా చేపడుతోంది. గతేడాది డిసెంబరులో చంద్రుడి పై నుంచి రాళ్లను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అంతేకాదు 2019లో చంద్రుడికి అవతల స్పేస్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది.