బైడెన్ వచ్చీ రాగానే... 28 మంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై చైనా నిషేధం... అదే కారణమా..?
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ చైనా పట్ల ఎలా వ్యవహరించబోతున్నారన్న చర్చ జరుగుతుండగానే డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని మొత్తం 28 మందిపై చైనా నిషేధం విధించింది. ఇందులో మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సహా ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు ఓబ్రెయిన్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు,వారి కుటుంబ సభ్యులకు ఇకపై చైనా ప్రధాన భూభాగంలోకి ఎంట్రీ నిషేధం. హాంకాంగ్,మకావ్,చైనా భూభాగాల్లోకి వీరికి ప్రవేశం ఉండదు.
Recommended Video
ఎందుకీ నిర్ణయం...
అమెరికా-చైనా సంబంధాలను దెబ్బతీసే... చైనా సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినందుకు వీరిపై నిషేధం విధించినట్లు చైనా ప్రకటించింది. వీరందరినీ యాంటీ చైనా పొలిటీషియన్లుగా అభివర్ణించింది. ఈ 28 మంది తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు తమ ప్రయోజనాలకు భంగం కలిగించారని చైనా ఆరోపించింది. అంతేకాదు,చైనా ప్రజలను వీరు అవమానించారని,కించపరిచారని ఆరోపణలు చేసింది.
జాబితాలో ఎవరెవరు... అదే కారణమా..?
చైనా నిషేధం విధించినవారిలో మైకెల్ ఆర్ పాంపియో, పీటర్ కె నవారో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ సి ఓబ్రెయిన్, డేవిడ్ ఆర్ స్టిల్వెల్, మాథ్యూ పాటింగర్, అలెక్స్ ఎమ్ అజార్ II, కీత్ జె క్రాచ్, కెల్లీ డికె క్రాఫ్ట్,జాన్ ఆర్ బోల్టన్,స్టీఫెన్ కె బన్నన్ ఉన్నారు. వీరంతా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులే. వైట్ హౌస్ను వీడే ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బీజింగ్పై చేసిన ప్రకటనే ఈ నిషేధానికి కారణమై ఉండొచ్చా అన్న చర్చ జరుగుతోంది. చైనాలోని ఉయ్ఘురు ముస్లింలను అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తోందని... మారణహోమానికి పాల్పడుతోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బహుశా ఈ నిర్ణయమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై నిషేధానికి కారణమై ఉండొచ్చునని తెలుస్తోంది.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ఏకీభవించిన బైడెన్ టీమ్...
ఉయ్ఘుర్ ముస్లింల ఊచకోతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని... దానిపై విచారణ కొనసాగించాలని విదేశాంగ శాఖను ఇటీవల మైక్ పాంపియో ఆదేశించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని చైనా వాదించడానికి బహుశా ఇదే కారణం కావొచ్చు. ఉయ్ఘుర్ ముస్లింలపై చైనా మారణహోమానికి సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ప్రకటనతో తాజా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా ఏకీభవించారు. దీన్నిబట్టి చైనా పట్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరించిన తీరుకు బైడెన్ టీమ్ వ్యవహరించబోయే తీరుకు పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు. ఒకరకంగా ఉయ్ఘుర్ ముస్లింల విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ది,తమది ఒకే వాదన అని బైడెన్ టీమ్ స్పష్టం చేసినట్లయింది. అలాంటప్పుడు తాజా చైనా నిర్ణయంపై కొత్త ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
బాధ్యతలు చేపట్టిన బైడెన్...
అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బుధవారం(జనవరి 20) పదవీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బైడెన్తో ప్రమాణస్వీకారం చేయించారు.127 ఏళ్ల చరిత్ర కలిగిన తమ ఫ్యామిలీ బైబిల్పై ప్రమాణం చేసి బైడెన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు డెలవర్ సెనేటర్గా ఏడుసార్లు, ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ ఇదే బైబిల్ను ఉపయోగించారు.