ఉ. కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 32మంది చైనీయులు మృతి
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చైనాకి చెందిన 32 మంది పర్యాటకులు మృతి చెందారు. పదులసంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోనిహువాంగాయ్ ప్రావిన్సులో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద స్థలికి చేరుకున్న చైనా అధికారులు మృతుల వివరాలపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సౌదీ అరేబియా: ప్రమాదంలో నలుగురు బ్రిటీషర్లు మృతి
సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ జాతీయులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర మక్కాకు 30 మైళ్ల దూరంలో ఉన్న అల్ ఖలాస్ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది.
ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన 12 మంది కూడా బ్రిటిష్ జాతీయులేనని సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని మక్కాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ సౌదీ అంబాసిడర్ మహ్మద్ బిన్ నవాఫ్ ట్వీట్ చేశారు.