శ్రీలంక తీరంలో మా నౌక అందుకే నిలిపాం-చైనా క్లారిటీ-భారత్, యూఎస్ కు భయాలొద్దు..
శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయంలో చైనాకు చెందిన భారీ నిఘా, పరిశోధన నౌక నిలపడంపై భారత్, యూఎస్ సహా పలు దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తైవాన్ లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన, అనంతరం దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో చైనా ఓడ శ్రీలంకకు రావడంపై అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై చైనా తొలిసారి స్పందించింది.
తమ హైటెక్ పరిశోధన నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతను ప్రభావితం చేయవని, భారత్ సహా మరే ఇతర దేశం కూడా దీనికి అడ్డు చెప్పకూడదని చైనా కోరింది. శ్రీలంక యొక్క వ్యూహాత్మక దక్షిణ నౌకాశ్రయం హంబన్తోటలో నౌకను నిలిపివేసింది. దీనిపై భారత్, యూఎస్ అభ్యంతరాలు తెలుపుతున్నాయి. దీనిపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ .. యువాన్ వాంగ్ 5 నౌక శ్రీలంక వైపు నుంచి క్రియాశీల సహకారంతో హంబన్టోట నౌకాశ్రయంలో విజయవంతంగా నిలిపినట్లు పేర్కొన్నారు.
చైనా నుండి అప్పులు తీసుకున్న USD 51 బిలియన్ల విదేశీ రుణంలో దివాలా తీసిన శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడంపైనా వాంగ్ స్పందించారు. శ్రీలంకకు ఓడ చేరుకున్నప్పుడు .. శ్రీలంకలోని చైనా రాయబారి క్వి జెన్హాంగ్ హంబన్టోటా ఓడరేవులో ఆన్సైట్ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారని వాంగ్ పేర్కొన్నారు. దీనిని చైనా 2017లో అప్పుల జమ కింద 99 ఏళ్ల లీజుకు తీసుకుందని ఆయన చెప్పారు.
హిందూ మహాసముద్రంలోని హంబన్తోట ఓడరేవులో మిలిటరీ అప్లికేషన్లు కలిగిన ఈ నౌకపై భారతదేశం, యుఎస్ ఆందోళనలను ప్రస్తావిస్తూ.. యువాన్ వాంగ్-5 నౌక సముద్ర శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు, సంప్రదాయాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు. కాబట్టి భారత్ సహా మరే ఇతర దేశం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే భారత్, యూఎస్ మాత్రం ఈ వాదనను నమ్మేలా కనిపించడం లేదు.