పాక్-చైనా: చెరగని స్నేహం! మరోసారి నిరూపితం! పాక్ కు చైనా జెట్ ఫైటర్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా మధ్య స్నేహబంధం చెరిగిపోలేదని మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించబోయే యుద్ధ విమానాల విన్యాసాల్లో చైనా పాల్గొనబోతోంది. దీనికోసం చైనా తన జెట్ ఫైటర్లను పాకిస్తాన్ కు పంపించింది. అవి రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకున్నాయి. పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నట్లుగా చెబుతోన్న కరడు గట్టిన ఉగ్రవాది, జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో దాఖలైన ప్రతిపాదనలపై చైనా అభ్యంతరం తెలిపిన మరుసటి రోజే..ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నెల 23వ తేదీన పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ తీర్మానించిన రోజును ఆ దేశా జాతీయ దినోత్సవంగా జరుపుకొంటారు. 1940 మార్చి 23వ తేదీన అప్పటి అఖండ భారతావనిలోని లాహోర్ లో గల మింటో పార్క్ లో అఖిల భారత ముస్లిం లీగ్.. ఈ తీర్మానంపై సంతకం చేసింది. అప్పటి నుంచి మార్చి 23వ తేదీన పాకిస్తాన్ జాతీయ దినోత్సవంగా గుర్తింపు పొందింది.
పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశం యుద్ధ విమానాలతో విన్యాసాలను చేపట్టనుంది. చైనా సహా టర్కీ, అజర్ బైజన్, బహ్రాయిన్, సౌదీ అరేబియా, శ్రీలంక దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. దీనికోసం టర్కీ ఇప్పటికే తన ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపించింది. తాజాగా చైనా తన జె-10 జెట్ ఫైటర్లను ఆ దేశానికి తరలించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన బాయీ ఏరోబాటిక్ బృందం ఇస్లామాబాద్ కు చేరుకుంది. ఈ వ్యవహారం చైనా-పాకిస్తాన్ దేశాల మధ్య స్నేహ బంధానికి గుర్తుగా భావించవచ్చని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు హ్యు ఝియాంగ్ అభిప్రాయపడ్డారు. 2017 నవంబర్ 19వ తేదీన పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఓ యుద్ధ విమానాల విన్యాసాల్లోనూ చైనా పాలుపంచుకుంది.