కలవరపెడుతున్న చైనా: జిబూటిలో తొలి సైనిక స్థావరం
ఆసియాతోపాటు ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఆఫ్రికా దేశమైన జిబూటీలో చైనా తన తొలి సైనిక స్థావరం ఏర్పాటుచేసుకోవడం గమనార్హం.
న్యూఢిల్లీ/బీజింగ్: ఆసియాతోపాటు ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యాన్ని చాటేందుకు ఆఫ్రికా దేశమైన జిబూటీలో చైనా తన తొలి సైనిక స్థావరం ఏర్పాటుచేసుకోవడం భారత్ తోపాటు ఇతర ఆసియా దేశాలకు ఆందోళనకలిగించే అంశంగా మారింది.
భారత్ను దెబ్బతీయడానికేనా?
కాగా, తనకు పోటీగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న ఇండియాను అన్ని విధాలా దెబ్బదీయడానికే చైనా తన తొలి విదేశీ సైనిక స్థావరం నిర్మిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాక, భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో చైనాకున్న సైనిక ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో చైనా సైనిక ఉనికి కనిపిస్తోంది.
Recommended Video
జిబూటీలో చైనా స్థావరంతో కలవరం..
రోజూ కోట్లాది డాలర్ల విలువైన ముడి చమురును వందలాది నౌకలు తీసుకెళ్లే ఆడెన్ సింధుశాఖకు సమీపంలోని చిన్న దేశం ఈ జిబూటీ. తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ ముస్లిం దేశంలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జపాన్కు సైనిక స్థావరాలున్నాయి. మారిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వల్ల చైనా స్థావరం ఏర్పాటు పలు దేశాలకు కలవరానికి గురిచేస్తోంది.
రెండు భారీ నౌకలు..
ఎడారి ప్రాంతమైన తన భూభాగాన్ని అద్దె-లీజు పద్ధతిపై స్థావరాల ఏర్పాటుకు ఇచ్చి జిబూటీ లబ్ధి పొందుతోంది. మంగళవారం దక్షిణ చైనా రేవుపట్నం జాంజియాంగ్ నుంచి రెండు భారీ నౌకలు జిబూటీకి చైనా దళాలతో బయల్దేరాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే ఎన్ని ఓడల్లో తమ దళాలు కొత్త స్థావరానికి వెళుతున్నది మాత్రం చైనా వార్తా సంస్థలు వెల్లడించలేదు.
భద్రత కోసమేనంటూ చైనా..
కీలక ప్రాంతంలో చైనా తన తొలి అంతర్జాతీయ సైనిక స్థావరం నెలకొల్పుతోందని అందరూ చెబుతుండగా.. ఈ ప్రాంతంలో తిరిగే తమ యుద్ధనౌకలకు సముద్రపు దొంగలు, ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించడానికే ఈ 'మద్దతు స్థావరం' నిర్మిస్తున్నామని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం బుధవారం తెలిపింది. అంతేగాక, చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకోవడంలో మౌలిక లక్ష్యం జాతీయ భద్రతేగాని ప్రపంచాధిపత్యం కాదని కూడా ఈ పత్రిక వాదిస్తోంది. కాని, గత రెండు నెలల్లో హిందూ మహాసముద్రంలో జలాంతర్గాములు, విధ్యంసక నౌకలు, కీలక సైనిక సమాచారం సేకరించే నావలు సహా చైనాకు చెందిన పది పదిహేను యుద్ధనౌకలు తిరగడాన్ని భారత నేవీ గుర్తించింది.
అమెరికా, జపాన్ల లక్ష్యంతోనే చైనా ఇలా
1992 నుంచి ఏటా అమెరికా, జపాన్తో కలసి మలబార్ సైనిక విన్యాసాల నిర్వహణ ద్వారా ఈ ప్రాంత జలాల్లో మూడు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారానికి ప్రతిస్పందనగానే చైనా జిబూటీలో సైనిక స్థావరం నిర్మిస్తోందని భావిస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని నౌకా మార్గాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవి. కాగా, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి పశ్చిమాసియా నుంచి దిగుమతిచేసుకునే ముడి చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతోంది.
భారత్కు ఇబ్బందులు తప్పవు?
జిబూటీకి సమీపంలోని సింధుశాఖల ద్వారానే ఈ క్రూడాయిల్ ట్యాంకర్లు భారత్కు వెళతాయి. ఈ నేపథ్యంలో అక్కడ చైనా స్థావరం నిర్మాణం ఇండియా ప్రయోజనాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్ మీదుగా ఓబీఓఆర్ పేరిట రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. పాక్-చైనా ప్రత్యేక ఆర్థిక కారిడార్ ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్లో అనేక పోర్టులు, మౌలిక సదుపాయాలు చైనా నిర్మిస్తోంది. అంతేగాక, గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా జిబూటిలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటుండటం భారత్ తోపాటు ఇతర ఆసియా దేశాలకు ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.