మళ్లీ అగ్గి రాజేస్తున్న చైనా: భూటాన్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే..ట్రైజంక్షన్ 'డోక్లాం'కి అతిసమీపంలో..
ఇటు భారత్తో,అటు భూటాన్తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు విస్తరణవాద కాంక్షతో ముందుకు సాగుతోంది. భారత్తో తూర్పు లదాఖ్లోని సరిహద్దుల్లో గత ఏడు నెలలుగా ప్రతిష్ఠంభనకు తెరలేపిన చైనా... తాజాగా భూటాన్ భూభాగాన్ని ఆక్రమించింది. 2017లో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన డోక్లాంకు అత్యంత సమీప భూభాగాన్ని చైనా ఆక్రమించడం గమనార్హం.
Recommended Video
ఏకంగా గ్రామాన్నే ఏర్పాటు చేసిన చైనా...
భూటాన్ భూభాగంలో 2కి.మీ పరిధిలో చైనా ఏకంగా ఒక గ్రామాన్నే ఏర్పాటు చేసింది. భారత్,చైనా,భూటాన్ల ట్రైజంక్షన్ డోక్లాంకు ఇది కేవలం 9కి.మీ దూరంలో ఉంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు ఫోటోలతో సహా ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. కానీ ఆ తర్వాత కొద్ది గంటలకే వాటిని తొలగించేశాడు. అయితే అప్పటికే ఆ ఫోటోలు భారత్ చేతికి చిక్కాయి. చైనా ఏర్పాటు చేసిన ఈ గ్రామం పేరు 'పాంగ్డా'గా చెప్తున్నారు. భూటాన్ అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని.. చైనా అక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఊహించిందే జరుగుతోంది...
ఒకరకంగా భారత్ ఊహించిన భయాలే నిజమవుతున్నాయి. మూడు దేశాల కూడలిగా ఉన్న డోక్లాం భూభాగాన్ని చైనా క్రమ క్రమంగా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని భారత్ ఎప్పుడో అంచనా వేసింది. పరిమిత సంఖ్యలో సాయుధ దళాన్ని కలిగిన భూటాన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా చైనా వ్యవహరిస్తుండటం భారత్కు ఆందోళన కలిగిస్తోంది. గతంలో డోక్లాంలో చైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు... భూటాన్ తరుపున భారతే గట్టిగా పోరాడింది. కొద్ది నెలల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు,ప్రతిష్ఠంభనకు అది దారితీసింది. చైనా చర్యలను భారత్ బలంగా తిప్పి కొట్టడంతో అప్పట్లో డ్రాగన్ వెనక్కి తగ్గక తప్పలేదు.
చైనా అక్కడ పట్టు సాధిస్తే భారత్కు ప్రమాదం...
భూటాన్ భూభాగంలో చైనా ఆక్రమణపై ప్రముఖ జాతీయ మీడియా అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తోంది. భూటాన్ అనుమతి మేరకే చైనా అక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసిందా... లేక తన మందబలంతో చైనా ఆ దేశాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తోందా అన్న విషయాలపై ఆరా తీస్తోంది. ఓవైపు లదాఖ్లో భారత్తో ప్రతిష్ఠంభనను కొనసాగిస్తూనే... మరో పొరుగు దేశంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతుండటం డ్రాగన్ వక్రబుద్దిని బయటపెడుతోంది. చైనా డోక్లాంపై పట్టు సాధిస్తే అది భారత్కు కూడా ప్రమాదమే కాబట్టి... డ్రాగన్ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు పసిగట్టే ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే 2017 తరహాలో మరోసారి భూటాన్ తరుపున చైనాను భారత్ నిలువరించే అవకాశం లేకపోలేదు.