వీడియో వైరల్: చైనాలో వింత ఘటన... చూస్తుండగానే భూమిలోకి కూరుకుపోయిన బస్సు
Recommended Video
బీజింగ్: బర్ముడా ట్రయాంగిల్ గురించి అంతా వినే ఉంటాం. సముద్రంలోని ఆ ప్రాంతం మీదుగా ఏదైనా నౌకలు లేదా దానిపైన భారీ విమానాలు వెళ్లినా అది తనలో కలిపేసుకుంటుందన్న విషయం తెలుసు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీనిపై ప్రయాణించిన విమానాలు లేదా దీని దగ్గరలో ప్రయాణించిన నౌకలు మాయమైయ్యాయి. ఇప్పటికీ దీని మిస్టరీ వీడలేదు. అలానే చైనాలో కూడా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు ఉన్నట్లుండి భూమిలోకి కూరుకుపోయింది.
భూమిలోకి కూరుకుపోయిన బస్సు
చైనాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. అంతా చూస్తుండగానే ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు హఠాత్తుగా భూమిలోపలికి కూరుకుపోయింది. ఈ ఘటన కింగాయ్ ప్రావిన్స్లోని క్సినింగ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది మృతి చెందగా 10 మంది అదృశ్యమయ్యారు. బస్సు లోపలికి కూరుకుపోగానే ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
గాల్లోకి లేచిన బస్సు
ముందుగా బస్సు వచ్చి బస్టాప్ దగ్గర ఆగింది. కొన్ని క్షణాల్లోనే ఆ బస్సు భూమిలోకి దిగిపోయింది. ఏమైందో తెలుసుకునేలోపే మరింత లోపలికి జారుకుంది. చాలామంది పాదాచారులు ఆ గుంటలోకి పడిపోయారు. అ గుంతే బస్సును మింగేసినట్లుగా అనిపించింది. బస్సు ముందుభాగం గుంతలోకి పడిపోవడంతో వెనక భాగం గాల్లోకి లేచింది. క్రమంగా ఆ గుంత పెద్దది కావడం కనిపించింది. క్రమంగా పెద్దదిగా మారడంతో రోడ్డుపై నడుస్తున్న పాదాచారులు ఒక్కొక్కరుగా గుంతలోకి పడిపోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది
ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే రెస్క్యూ టీమ్ బయలుదేరింది. గుంతలో పడిపోయిన వారి జాడకోసం సిబ్బంది వెతుకుతోంది. ఇప్పటివరకు ఎలాంటి ఆనవాలు కనిపించలేదని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ 16 మందిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింక్ హోల్స్తో చాలా ప్రమాదం
జరిగిన ప్రమాదానికి కారణం సింక్ హోల్స్ అని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలో సింక్ హోల్స్తో చాలా ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. 2016లో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లో ఓ భారీ సింక్హోల్లో పడి ముగ్గురు మృతి చెందారు. అయితే భారీ వర్షాలకు భూమిలో ఉన్న నీటి పైపులు విరిగి అక్కడ పెద్ద గుంతలాంటిది ఏర్పడటం వల్లే వీరు మృతి చెంది ఉంటారని విచారణలో తేలింది. 2013లో షెంజాన్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఉన్న గేట్ వద్ద భారీ సింక్హోల్ తెరుచుకోవడంతో 5 మంది పడి మృతి చెందారు.