కరోనా కల్లోలంలోనూ: మార్స్పై చైనా రోవర్: రెడ్ ప్లానెట్పై వరుస ప్రయోగాలు: ఫస్ట్ ఎమిరేట్స్..
బీజింగ్: ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్ర దేశాల నుంచి ప్రతికూల చర్యలను చవి చూస్తోంది. మరోవంక భారత్తో సరిహద్దు వివాదానికి తెర తీసింది. వాస్తవాధీన రేఖ వద్దను దాటుకుని భారత్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. యుద్ధ వాతావరణం ఏర్పడటానికి కేంద్రబిందువుగా మారింది.
మిషన్ మార్స్: రెడ్ ప్లానెట్పై పరిశోధనలు: గల్ఫ్ కంట్రీ సంచలనం: ఏడు నెలల్లో: అరబ్ దేశాల్లో
అంగారకుడిపై ప్రయోగానికి..
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చైనా అంగారకుడిపై ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించింది. దీనికి తియాన్వెన్-1 అని పేరు పెట్టింది. హైనన్ ప్రావిన్స్లోని వెన్ఛాంగ్ స్పేస్ లాంచ్ స్టేషన్ నుంచి లాంగ్మార్చ్-5 వై4 వాహకనౌక ద్వారా దీన్ని అంగారకుడిపైకి పంపించింది. అంగారకుడిపై ప్రయోగాలను చేపట్టడానికి చైనా పంపించిన మొట్టమొదటి ప్రోబ్ ఇది. రెడ్ ప్లానెట్ వైపు దూసుకెళ్లిన ఈ వాహక నౌక ప్రయోగం ఫలించినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) శాస్త్రవేత్తలు ప్రకటించారు.
2021 ఫిబ్రవరి నాటికి
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఇది అంగారకుడి కక్షలోకి ప్రవేశిస్తుందని సీఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు తెలిపారు. ఫిబ్రవరి రెండోవారంలో అంగారక గ్రహం గురుత్వాకర్షణలో ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. అనంతరం కొద్దిరోజుల్లోనే అంగారక గ్రహంపై దిగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్స్ మిషన్ను విజయవంతం చేయడానికి చైనా శాస్త్రవేత్తలు విదేశీ నిపుణుల సహాయాన్ని తీసుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అర్జెంటీనా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులు అయ్యాయి. పే లోడ్, డేటా విశ్లేషణ కోసం ఫ్రాన్స్, ఆస్ట్రియా సహకారాన్ని తీసుకుంది.
ప్రత్యేకతలు ఇవే..
57 మీటర్ల పొడవు ఉన్న ఈ వాహకనౌక బరువు 870 టన్నులు. ఇందులో అమర్చిన జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ట్రాన్స్పాండర్,రోవర్, మార్స్ ఆర్బిట్ ఇన్సెర్షన్, లాంగ్టర్మ్ ఆటోమేటిక్ ప్రోబ్ మేనేజ్మెంట్, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ వంటి అత్యాధునిక పరికరాలను ఇందులో అమర్చారు. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. సెకెనుకు 11.2 కిలోమీటర్ల వేగంతో ఈ వాహకనౌక ప్రయాణిస్తుంది.
Recommended Video
అంగారక గ్రహంపై వరుస ప్రయోగాలు..
కాగా.. అంగారక గ్రహంపై వరుస ప్రయోగాలకు వివిధ దేశాలు సిద్ధపడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగు రోజుల వ్యవధిలో మార్స్పై ప్రోబ్ మిషన్ను పంపించడం ఇదే రెండోసారి. ఈ నెల 19వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ ఉపగ్రహాన్ని పంపించింది. ఈ నెల 30వ తేదీన నాసా కూడా ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మార్స్పై పరిశోధనలను చేపట్టడానికి ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించబోతోంది.