భారత విమానాలను తాత్కాలికంగా రద్దు చేసిన చైనా: కరోనానే కారణమట!
న్యూఢిల్లీ/బీజింగ్: కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి వదిలిన చైనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది కరోనాబారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కాగా, తాజాగా, కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ చైనా ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా.. భారత్ నుంచి వచ్చే విదేశీయుల్ని చైనాలోకి అనుమతించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయించినట్లు తెలిపింది. ఈ క్రమంలో భారత్లోని తమ రాయబార కార్యాలయం అధికారులు చైనా వీసా, నివాస అనుమతులు కలిగిన వారికి ఆరోగ్య నిర్ధారణ దరఖాస్తులను ఇవ్వరని తెలిపింది.
ఈ నిబంధనలు చైనా దౌత్య, గౌరవ, సీ వీసాలు కలిగి ఉన్నవారిపై ప్రభావం చూపించవని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా అత్యవసర సందర్శనకు వచ్చేవారు రాయబార కార్యాలయంలో వీసా దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ నిబంధనలు తాత్కాలిక అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, వారం క్రితం ఢిల్లీ నుంచి వూహాన్కు ఎయిరిండియా విమానంలో వెళ్లిన వారిలో 20 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో చైనా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో నవంబర్ 13 నుంచి డిసెంబర్ 4 వరకు చైనాకు ఇప్పటికే షెడ్యూల్ చేసిన నాలుగు (వందేభారత్) ఎయిరిండియా విమానాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. భారత్ తోపాటు బ్రిటన్, బెల్జియం, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే సందర్శకులకు కూడా ఇదే తరహా ఆదేశాలను చైనా జారీ చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.