చైనా అసలు బుద్ది మరోసారి: భారత్ సాయాన్ని మరిచి.. ప్రకటన
చైనా నేవీలో పని చేసే వారికి ఉన్న సోయి చైనా పెద్దలకు లేకుండా పోయింది. ఆడెన్ సింధూశాఖలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన భారీ వాణిజ్య నౌకను భారత్,చైనా నేవీ సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రక్షించాయి
ఢిల్లీ: చైనా నేవీలో పని చేసే వారికి ఉన్న సోయి చైనా పెద్దలకు లేకుండా పోయింది. ఆడెన్ సింధూశాఖలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన భారీ వాణిజ్య నౌకను భారత్, చైనా నేవీ సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రక్షించాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యాక చైనా ఆర్మీ అధికారులు మన నేవీకి ధన్యవాదాలు చెప్పారు.
సాయం మరిచిన చైనా
కానీ, చైనా విదేశాంగ అధికార ప్రతినిధులు మాత్రం భారత్ సాయాన్ని మర్చిపోయారు. తామక్కరమే వాణిజ్య నౌకను రక్షించినట్లు చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి హువా చునియింగ్ అధికారిక ప్రకటన చేస్తూ.. చైనా నేవీ దళం సముద్రపు దొంగలపై ప్రభావవంతమైన పోరాటతెగువను చూపిందని ప్రకటించారు.
భారత నేవీనే తొలుత స్పందించింది కదా అంటే..
ఆ ఆపరేషన్లో భారత నేవీనే తొలుత స్పందించింది కదా, సాయం చేసింది కదా అని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. తామే మొత్తం చేసినట్లుగా ప్రకటించుకున్నారు. దీంతో మరోసారి చైనా కపటబుద్ధి బయటపడినట్లయింది.
హైజాక్ చేశారు
తువాలుకు చెందిన భారీ వాణిజ్య నౌక ఒకటి పిలిప్పీన్స్కు చెందిన వారితో మలేషియా నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడేన్కు బయలుదేరింది. దీనిని సముద్రపు దొంగలు శనివారం రాత్రి హైజాక్ చేశారు.
సమాచారం అందించగా
ఈ విషయాన్ని ఈ నౌకను నిర్వహిస్తున్న బ్రిటన్ ఆ సమయంలో భారత్, చైనా, పాకిస్థాన్, ఇరాన్ దేశాలకు సమాచారం అందించగా భారత్ వేగంగా స్పందించింది. ముందుగా నేవీ హెలికాప్టర్ను పంపించి ఆ నౌకపైనే రక్షణగా చక్కర్లు కొట్టింది.
ఆపరేషన్ సంయుక్తంగా
ఆ తర్వాతే చైనాకు చెందిన 18మంది నేవీ ఆర్మీ ఆ షిప్లోకి అడుగు పెట్టారు. అనంతరం భారత్కు చెందిన యుద్ధనౌకలు హైజాక్ గురయిన షిప్ను సమీపించగానే సముద్రపు దొంగలు పారిపోయారు. ఈ ఆపరేషన్ సంయుక్తంగా నిర్వహించినప్పటికీ చైనా తప్పుడు ప్రకటన చేసింది. తమ ఘనతగా చెప్పుకుంది.