కరోనా : చిరకాల మిత్రుడి కోసం రంగంలోకి చైనా.. పాక్లో ఏం చేయబోతుందో తెలుసా..?
పాకిస్తాన్-చైనా మధ్య సత్సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు,మూడేళ్ల నుంచి పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పాకిస్తాన్కు సంబంధించి అంతర్జాతీయ సమాజం లేవనెత్తే ఉగ్రవాద అంశాల్లోనూ చైనా పాక్ను వెనకేసుకురావడం.. తనకున్న విశేషాధికారాలను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో కరోనా విపత్తు పాకిస్తాన్ సతమతమవుతుంటే చైనా చూస్తూ ఊరుకుంటుందా.. అందుకే రంగంలోకి దిగింది. చైనాలో నిర్మించినట్టే రెండు భారీ తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించేందుకు సిద్దమైంది.
పాకిస్తాన్లో ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్న చైనా
పాకిస్తాన్లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1664గా ఉంది. మృతుల సంఖ్య 18కి చేరుకుంది. లోకల్ కాంటాక్ట్ కేసులు పెరిగిపోవడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి టెన్షన్ పట్టుకుంది. దీంతో తన చిరకాల మిత్రుడు చైనాను సాయం కోరారు. అంతే.. చైనా రంగంలోకి దిగింది. కరోనా రోగుల చికిత్స కోసం రెండు భారీ తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకుంది. గత వారమే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా ఈ విషయాలను వెల్లడించారు.
ఇప్పటివరకు ఏమేమి అందించారు..
చైనాలోని వుహాన్ నగరంలో నిర్మించినట్టే 2300 పడకల సామర్థ్యంతో రెండు తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించనున్నట్టు హువా తెలిపారు. అంతేకాదు, చైనా నుంచి 8మంది ప్రత్యేక వైద్య నిపుణులను,అవసరమైన సహాయ సామాగ్రిని శనివారం(మార్చి 28)న ప్రత్యేక విమానాల్లో ఇస్లామాబాద్కి తరలించినట్టు చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు కూడా అవసరమైన మెడికల్ సామాగ్రిని పంపించారు. అలాగే ఐదు వెంటిలేటర్లు,2000 సేఫ్టీ దుస్తులు,20వేల మెడికల్ మాస్కులు,24వేల న్యూక్లిక్ యాసిడ్ టెస్టింగ్ కిట్స్ను గిల్గిట్-బాల్టిస్తాన్కు తరలించారు.
Recommended Video
మున్ముందు మరింత సాయానికి సిద్దమని ప్రకటన..
చైనాలోని పలు ప్రావిన్స్ల నుంచి కూడా పాకిస్తాన్కు అవసరమైన మెడికల్ సామాగ్రి అందినట్టు హువా తెలిపారు. కష్టకాలంలో పరస్పర సహాయ సహకారాలు అందించుకునే సత్సంబంధాలు తమ మధ్య ఆనవాయితీగా కొనసాగుతున్నాయన్నారు. మున్ముందు పాకిస్తాన్కు అవసరమైతే మరిన్ని సహాయ,సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పాక్-చైనా సత్సంబంధాలు యావత్ అంతర్జాతీయ సమాజానికి తెలిసిందే. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన వుహాన్ నగరంలో తమవాళ్లు వెయ్యి మంది చిక్కుకుపోయినప్పటికీ.. పాకిస్తాన్ వారిని వెనక్కి రప్పించలేదు. వారి సంరక్షణ బాధ్యత తమదేనని చైనా ప్రభుత్వం భరోసానివ్వడంతో.. వుహాన్లో చిక్కుకుపోయిన పాకిస్తానీయులు కోరినప్పటికీ.. వారిని స్వదేశానికి రప్పించలేదు. అంతలా ఇరు దేశాల పట్ల ఒకరంటే ఒకరికి నమ్మకం. మార్చి 16న పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వి బీజింగ్కి వెళ్లి కరోనా వైరస్తో చేస్తున్న యుద్దానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి మద్దతు కూడా తెలిపి వచ్చారు.