కరోనా వైరస్పై పోరు: మహమ్మారిని పారదోలేందుకు 173 బిలియన్ డాలర్లు కేటాయించిన చైనా
చైనాను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా భారీగా నిధులు కేటాయించింది. కరోనా వైరస్ను దేశం నుంచి పారద్రోలేందుకు చైనా 173 బిలియన్ డాలర్లు కేటాయించింది. కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలకోసం ఈ భారీ స్థాయిలో నిధులను విడుదల చేసింది. ఇక పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసిన చైనా... అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఖజానాలో సరిపడేంత నగదు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రకటించింది.
కరోనా పై పోరుకు సహకరిస్తున్న సంస్థలకు చేయూత
కొత్త సంవత్సరం సందర్భంగా గత కొన్ని రోజులుగా చైనా స్టాక్ మార్కెట్లు మూతపడిఉన్నాయి. త్వరలో తెరుచుకుంటుండటంతో చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కరోనా వైరస్తో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 14వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా వైరస్ పోరులో తమ వంతు కృషి చేస్తున్న సంస్థలను ఆర్థికంగా ఆదుకుంటామని కూడా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రకటించింది. ఇలాంటి సంస్థలకు రుణాలతో పాటు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది చైనా సెంట్రల్ బ్యాంక్. హాస్పిటల్స్కు , మెడికల్ రీసెర్చ్ యూనిట్లకు ఇతర వస్తువులు నిర్వహించేవారికి రుణాలు ఇవ్వాలని పలు బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.
దిగుమతి సుంకం రద్దు చేస్తున్నట్లు ప్రకటన
ఇక కరోనా వైరస్ పోరులో భాగంగా పలు వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలకు దిగుమతి సుంకం మినహాయింపు ఇచ్చింది. అమెరికా నుంచి వచ్చే వస్తువులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త క్షీణిస్తున్న క్రమంలో వ్యవస్థలోకి డబ్బులు ప్రవహించేలా చేసి తద్వారా ఆర్థిక వ్యవస్థను బూస్టప్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్తో మార్కెట్లు దెబ్బతిన్నాయని ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఉండబోదని అధికారులు చెప్పారు. మరోవైపు చైనా పర్యాటక రంగం ఇప్పటికే కుదేలయ్యింది. చాలా కార్యక్రమాలు రద్దు కావడం, పలు పర్యాటక ప్రాంతాలు మూతపడటం, ప్రజలు ఇళ్లు వీడి బయటకు రాకూడదన్న ప్రభుత్వాదేశాలతో పర్యాటక రంగం పూర్తిగా స్తంభించిపోయింది.
తమ ఫ్యాక్టరీలను మూసేసిన దిగ్గజ సంస్థలు
చైనాలో ఆపరేట్ అవుతున్న విదేశీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. తైవాన్కు చెందిన టెక్ జైంట్ ఫాక్స్కాన్ తన ఫ్యాక్టరీలను ఫిబ్రవరి రెండో వారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడి స్థానిక ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు టయోటా, ఐకియా, స్టార్బక్స్, టెస్లా, మెక్డొనాల్డ్స్, వోక్స్వాగన్ సంస్థలు కూడా తమ ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక మరో టెక్ దిగ్గజ సంస్థ టెన్సెంట్ తమ ఉద్యోగస్తులను ఫిబ్రవరి 10 వరకు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి 6.1శాతంకు పడిపోయింది. గత మూడు దశాబ్దాల్లో ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా క్షీణించిన చైనా వృద్ధి రేటు
ఒకవేళ కరోనా వైరస్ మరింత కాలం కొనసాగితే చైనా ఆర్ధిక వ్యవస్థకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. 2019 లో చైనా వృద్ధి రేటులో వినియోగం 3.5 శాతం పాయింట్లకు దోహదపడిందని ఎస్ అండ్ పి విశ్లేషకులు తెలిపారు. వినియోగం విషయంలో 10శాతం క్షీణత కనిపించిందంటే దానర్థం జీడీపీ 1.2శాతం పాయింట్ల మేరా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.