తీరు మారని చైనా: రాళ్లతో కొట్టుకున్నారు: గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై కీలక ప్రకటన: అవార్డులు
బీజింగ్: నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. డ్రాగన్ కంట్రీ చైనా విషయంలో ఇది రుజువైంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది సంభవించిన ఘర్షణలు, దాడుల్లో చైనాకు చెందిన కొందరు సైనికులు మరణించినట్లు ఎట్టకేలకు తేలింది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో నలుగురికి అత్యుత్తమ సైనిక పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కథనాలను చైనా మీడియా తాజాగా ప్రచురించింది.
గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై
లఢక్ ఈశాన్య ప్రాంతంలో వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద గత ఏడాది జూన్లో భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుల మధ్య ప్రాణాంతక దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగంపైకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన చైనా సైనికులను నిలువరించే క్రమంలో ఈ ఘర్షణలు సంభవించాయి. ఈ ఘటనలో తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు.
ప్రాణనష్టంపై తాజా ప్రకటన..
చైనా తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉంటుందంటూ అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ సమాచారాన్ని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఘర్షణలు జరిగాయనే విషయాన్ని నిర్ధారించిందే తప్ప సైనికులు మరణించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. తాజాగా గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో తమ సైనికులు అమరులయ్యారని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
అత్యుత్తమ సైనిక పురస్కారాలు..
ఈ ఘర్షణల్లో వీరమరణం పొందిన వారిలో నలుగురికి అత్యుత్తమ సైనిక పురస్కారాలను అందజేస్తున్నట్లు పీఎల్ఏకు చెందిన అత్యుత్తమ సైనిక విభాగం సెంట్రల్ మిలటరీ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పీఎల్ఏ గ్ఝిన్జియాంగ్ మిలటరీ కమాండ్ రెజిమెంట్ కమాండర్ క్వి ఫ్యాబో, చెన్ హోంగ్జున్, చెన్ గ్ఝియాంగ్రోంగ్, గ్ఝియో సియుయాన్, వాంగ్ ఝౌరాన్ అమరులైనట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. సరిహద్దుల్లో విదేశీ సైన్యం చేపట్టిన దాడుల్లో వారు వీరమరణం పొందినట్లు పేర్కొంది.
తప్పు భారత్దేనట..
వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్ల దూకుడు చర్యలకు పీఎల్ఏ సైనికులు అమరులైనట్లు తెలిపింది. తమదేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి భారత జవాన్లు ప్రయత్నించారని, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైనికులు వీరమరణం పొందారని తెలిపింది. ఘర్షణలు ఎలా చోటు చేసుకున్నాయనే విషయంపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది అక్కడి మీడియా. భారత జవాన్లు రాళ్లతో దాడులు చేసినట్లు పేర్కొంది. తమకు జరిగిన ప్రాణనష్టానికి భారత్దే బాధ్యతంటూ విమర్శించింది.