చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!
ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని అమెరికా అద్యక్షుడు చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా, చైనా మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. వాణిజ్య చర్చల పునరుద్ధరణకు ఈ రెండు దేశాలు అంగీకరించాయి. చైనా ఎగుమతులపై కొత్త ట్యారిఫ్ల విధింపును అమెరికా నిలిపేయబోతోంది. దీంతో ఓ ఏడాది నుంచి పోటాపోటీగా ఒకరిపై మరొకరు విధించుకుంటున్న వందల కోట్ల డాలర్ల ట్యారిఫ్ల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ట్యారిఫ్ల వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రభావితమైన సంగతి తెలిసిందే. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సమావేశాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 80 నిమిషాలపాటు చర్చలు జరిపారు.
అనంతరం ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ మళ్ళీ గాడిన పడ్డామని, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. ప్రస్తుత దిగుమతి ట్యారిఫ్లను మార్చబోమని చెప్పారు. అయితే అదనంగా చైనా ఎగుమతి చేయబోయే 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై కొత్త లెవీలను విధించబోమని తెలిపారు. ట్యారిఫ్లపై తాము వెనుకకు తగ్గుతామని, వ్యవసాయోత్పత్తులను చైనా కొంటుందని చెప్పారు. దీనిపై ఒప్పందం కుదిరితే, అది చరిత్రాత్మకమవుతుందన్నారు. ట్రంప్, జిన్పింగ్ చర్చలపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. చైనా ఎగుమతులపై అమెరికా కొత్తగా ట్యారిఫ్లను విధించబోదని పేర్కొంది. ఇరు దేశాల అధికారులు నిర్దిష్ట అంశాలపై చర్చలు జరుపుతారని పేర్కొంది. చైనా కంపెనీల పట్ల న్యాయమైన వైఖరిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్కు జిన్పింగ్ చెప్పారని తెలిపింది.