నేపాల్ సంక్షోభంలోకి చైనా- కమ్యూనిస్టుల రాజీకి యత్నాలు- భారత్కు ఛాన్స్ లేకుండా
నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం కారణంగా పార్లమెంటు రద్దయిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత్తో సరిహద్దు సంక్షోభం నేపథ్యంలో నేపాల్ను మన దేశంపైకి ఎగదోసిన చైనా ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగిస్తోంది. నేపాల్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించే నెపంతో భారత్కు మద్దతుగా నిలిచే ప్రచండను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది.
నేపాల్లో పార్లమెంటు రద్దుకు దారి తీసిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే నెపంతో ఖాట్మండులోని చైనా రాయబారి హో యాంకీ ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకీ, ప్రచండ వర్గానికి మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఓ చివరి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టు దిగ్గజాల మధ్య రాజీ యత్నానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అంతకుముందు నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీతోనూ చైనా రాయబారి సమావేశమయ్యారు.
నేపాల్లో సంక్షోభానికి కారణమైన కమ్యూనిస్టు పార్టీ కీలక నేత పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తోనూ చైనా రాయబారి భేటీ అయ్యారు. నేపాల్లో సంక్షోభం కొనసాగితే అది అంతిమంగా భారత్కు మేలు చేస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భారత్కు మద్దతుగా ఉండే ప్రచండ చైనాకు అనుకూలంగా ఉండే కేపీ శర్మ ఓలీతో ముఖాముఖీ తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రచండను ఒప్పించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ఉత్కంఠ రేపుతున్నాయి.