పాక్ ఆధీనంలో అభినందన్ విడుదలను స్వాగతించిన చైనా
బీజింగ్: పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలను చైనా శుక్రవారం స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పోరాడాలని సూచించింది. శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాలని చెప్పింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడిపై సరైన ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇరుదేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు సానుకూల వాతావరణం సృష్టించుకోవాలని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల్లో శాంతి నెలకొనాలన్నదే చైనా అభిమతమన్నారు.
బుధవారం జరిగిన రష్యా, చైనా, భారత్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పుల్వామా దాడిని ముక్తకంఠంతో ఖండించారు. అంతకుముందు చైనా విదేశాంగ మంత్రితో సమావేశమైన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ భూభాగంలో భారత్ జరిపిన దాడికి గల కారణాలను వివరించారు.