ట్రంప్ సర్కారు నిర్ణయానికి కోర్టు బ్రేక్: అమెరికాలో వీచాట్ నిషేధం తాత్కాలిక నిలిపివేత
వాషింగ్టన్: అమెరికాలో వీచాట్ మేసేజింగ్ యాప్ డౌన్లోడ్పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం అమలును ఆపాలంటూ యూఎస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చైనాకు చెందిన టిక్టాక్, వీచాట్ యాప్ల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ట్రంప్ సర్కారు వాటిని గత ఆదివారం నుంచి నిషేధించిన విషయం తెలిసిందే.
అయితే, ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన నిషేధం అమలు.. కొద్ది గంటల ముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిలిచిపోయింది. వీచాట్ యాప్ టన్నెంట్ హోల్డింగ్స్ సంస్థ(చైనా)కు చెందినది. ఈ నేపథ్యంలో నిషేధంపై వీచాట్ తరపున 'యూఎస్ వీ చాట్ యూజర్స్ ఆలియన్స్' తదితర వినియోగదారులు కాలిఫోర్నియాలోని నార్తెర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు.
అమెరికా ప్రభుత్వం తాజాగా నిషేధం విధించడం వల్ల అక్కడ నివసిస్తున్న చైనా జాతీయులకు ప్రాథమిక సమాచార మాధ్యమం అందుబాటులో లేకుండా పోతుందని వారు కోర్టుకు విన్నవించారు. ఈ పరిస్థితి అమెరికన్ రాజ్యాంగం తొలి సవరణ హక్కులకు భంగం కలిగించినట్లే అనే వాదనతో న్యాయమూర్తి లారెల్ బీలర్ ఏకీభవించారు. వీచాట్ డౌన్ లోడ్ నిషేధం అమలు తాత్కాలిక నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీచాట్ సంస్థ కాస్త ఊపిరి పీల్చుకుంది.
అంతకుముందు జరిగినా పరిణామాలను గమనించినట్లయితే.. చైనాకు చెందిన టిక్టాక్, వీచాట్ యాప్లను నిషేధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. వచ్చే ఆదివారం నుంచి ఈ రెండు యాప్ల డౌన్లోడ్లను నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్ ఆరోపించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బైట్డ్యాన్స్ లిమిటెడ్కు చెందిన టిక్టాక్ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో భద్రతారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.