చైనా అపర కుబేరుడు జాక్ మా ఎక్కడున్నాడో తేలింది: బందీగా: అజ్ఙాతంలోకి వెళ్లడానికి కారణం ఇదీ
బీజింగ్: చైనాకు చెందిన అపర కుబేరుడు జాక్ మా ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? ఎందుకు కనిపించట్లేదు?.. కొంతకాలంగా జనం మెదళ్లను తొలుస్తోన్న ప్రశ్నలివి. రోజూ వార్తల్లో నిలిచే ఓ దిగ్గజ పారిశ్రామికవేత్త, బిలియనీర్.. ఏకంగా రెండునెలల పాటు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడిగా, బిలియనీర్గా ఓటమి ఎరుగని పారిశ్రామికవేత్త ఉన్నట్టుండి మాయం కావడానికి కారణం దొరికింది. ఆయన ఎక్కడున్నాడనే ప్రశ్నకు సమాధానం లభించింది. బిజినెస్ న్యూస్ పోర్టల్ సీఎన్బీసీ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
ఉద్దేశపూరకంగానే అజ్ఙాతంలోకి..
తమకు ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జాక్ మా అదృశ్యం కాలేదని సీఎన్బీసీ పేర్కొంది. ఆయన ఉద్దేశపూరకంగానే అజ్ఙాతంలోకి వెళ్లారని తెలిపింది. రెండు నెలల సుదీర్ఘకాలం పాటు ఆయన అజ్ఙాతంలోకి వెళ్లడానికి అసలు కారణం తెలియరానప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలనే కోరికతోనే ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు సీఎన్బీసీ కరెస్పాండెంట్ డేవిడ్ ఫ్యాబెర్ పేర్కొన్నారు. జాక్ మా అదృశ్యం కావడంపై ఒక ప్రత్యేక కథనాన్ని రూపొందించారు. జాక్ మాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
హాంగ్ఝౌలో విశ్రాంతి..
జాక్ మా ప్రస్తుతం హాంగ్ఝౌలో ఉన్నట్లు సీఎన్బీసీ పేర్కొంది. గ్ఝెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని.. హాంగ్ఝౌ. అలీబాబా కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్నదక్కడే. జాక్ మా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికే అవకాశాలు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆయన తన ఇష్టపూరకంగానే అజ్ఙాతంలోకి వెళ్లాడని భావిస్తున్నామని, ఎవరి ఆధీనంలోనూ లేడని, ఒకకి చేతిలో బందీగా ఉన్నారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. గ్ఝి జిన్పింగ్ సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఆయనను బెదిరింపులకు పాల్పడి ఉండొచ్చని తాము భావించట్లేదని వివరించింది.
చైనాకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి..
చైనాకు చెందిన ఒకరిద్దరు అత్యున్నత పారిశ్రామిక వేత్తలతో మాత్రమే జాక్ మా తరచూ టచ్లో ఉంటున్నట్లు తేలిందని, వారి ద్వారానే తమకు ఈ సమాచారం అందినట్లు సీఎన్బీసీ తెలిపింది. ఇది వందశాతం నిజమంటూ ధృవీకరించలేమని, తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారమే ఈ కథనాన్ని ప్రసారం చేసినట్లు వివరణ ఇచ్చింది. జాక్ మా త్వరలోనే బాహ్య ప్రపంచంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని, ఆ తరువాతే.. అజ్ఙాతంలోకి వెళ్లడానికి సరైన కారణం లభిస్తుందని అభిప్రాయపడింది.
ఒక్కసారిగా పెరిగిన షేర్ వేల్యూ..
జాక్ మా గురించి కొంత కీలక సమాచారం వెలుగులోకి రావడంతో.. ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ మెరుగుపడింది. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టెడ్ కంపెనీ అయిన అలీబాబా షేర్ల విలువ 5.5 డాలర్ల మేర పెరిగింది. మంగళవారం షేర్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 240.40 డాలర్ల వద్ద నిలిచింది. అజ్ఙాతాన్ని వీడి బయటికి వస్తే.. యాంట్ గ్రూప్ సంస్థలు మళ్లీ భారీగా లాభాలను ఆర్జించడం ఖాయమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదివరకు రెండు నెలల కాలంలో ఆయన కంపెనీలు 80 వేల కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.