నగ్న ఫొటోలు పంపితేనే రుణం: చైనా కంపెనీ పైత్యం
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్మనీ సెక్స్ రాకెట్ లాంటి దురాగతాలు చైనాలో వెలుగుచూశాయి. విద్యార్థినులు, మహిళలు రుణం కావాలంటే నగ్నంగా ఉండే ఫొటోలు ఇవ్వాలని అక్కడి ఓ కంపెనీ డిమాండ్ చేసింది.
వడ్డీకి రుణం కావాలంటే తప్పనిసరిగా నగ్నఫొటోలు ఇవ్వాలని చాలామంది కాలేజీ విద్యార్థినులను ఆ రుణ సంస్థ అడిగినట్లు ప్రభుత్వ పత్రిక బీజింగ్ యూత్ డైలీ తెలిపింది.
గుర్తింపు కార్డూ ఇవ్వాలని జేడీ క్యాపిటల్స్కు చెందిన జీయేదేబావో సంస్థ విద్యార్థులను డిమాండ్ చేసినట్లు పేర్కొంది. అంతేగాక, తీసుకున్న రుణం చెల్లించకపోతే నగ్న ఫొటోలను కుటుంబసభ్యులకు, మిత్రులకు చూపుతామని ఆ సంస్థ బెదిరిస్తోంది.
చిన్న వ్యాపారం చేయాలనుకున్న ఓ యువతి ఆ సంస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంది. ఇందుకు ఆమె తన నగ్న ఫొటోలను ఆ సంస్థకు పంపింది. కాగా, నాలుగు నెలల్లో వడ్డీ బాగా పెరిగిపోవడంతో ఆ భారీ మొత్తాన్ని ఆమె చెల్లించలేకపోయింది. దీంతో ఆమె ఫొటోలను అందరికి పంపుతామని బెదిరింపులకు దిగింది. అంతేగాక, వ్యభిచారం చేసేందుకు సిద్ధమేనా? అంటూ ఆమెను వేధించసాగింది. ఈ వివరాలను బాధితురాలు మీడియాకు స్వయంగా తెలిపింది.