సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయి, భారత్ నుంచి అదే ఆశిస్తున్నాం: చైనా
బీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా పేర్కొంది. ఇరుదేశాలు తమ తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది.
త్వరలోనే భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరుగుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం వెల్లడించారు. కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం మేరకు గల్వాన్ తోపాటు ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్-చైనా తమ తమ బలగాలు ఉపసంహరణకు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు .
ప్రస్తుతం సరిహద్దు వెంట పరిస్థితులు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే డబ్ల్యూఎంసీసీ సమావేశం నిర్వహించి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తామని లిజియాన్ తెలిపారు. అయితే, చైనా బలగాల ఉపసంహరణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తుందని, ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తుందని చైనా ఆశిస్తున్నట్లు లిజియాన్ తెలిపారు. గత నెల రోజుల నుంచి సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
జూన్ 15న చైనా బలగాలు భారత జవాన్లపై దొంగదారిన దాడి చేసి 21 మంది ప్రాణాలు తీసింది. భారత జవాన్లు చేసిన ప్రతిదాడిలో సుమారు 45 మందికిపైగా చైనా బలగాలు హతమయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగితే ఇరుదేశాలకు భారీ నష్టం జరిగే పరిస్థితి ఉండటంతో శాంతి చర్చలకు మొగ్గుచూపాయి.