మా సత్తా తెలిసీ.. మాతో ఆటలా? కశ్మీర్ లో వేలు పెట్టాలా? భారత్ పై చైనా హూంకరింపు
బౌద్ధ మత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా జీర్ణించుకోలేకపోతోంది. రోజుకో బెదిరింపుతో భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.
బీజింగ్: బౌద్ధ మత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా జీర్ణించుకోలేకపోతోంది. రోజుకో బెదిరింపుతో భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కశ్మీర్ అంశంలోనూ తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ అక్కడి మీడియాలో కారుకూతలు కూసింది.
అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చాలా వరకు తమ దక్షిణ టిబెట్ లోనిదే అనేది చైనా వాదన. తాము వేర్పాటువాదిగా చూస్తున్న దలైలామా ఇలాంటి వివాదాస్పద భూభాగంలో పర్యటించడానికి భారత్ అనుమతివ్వడాన్ని చైనా సహించలేకపోతోంది.
చైనా సత్తా ఏమిటో తెలిసి కూడా భారత్ ఇలా ఎలా ప్రవర్తించగలుగుతోందో... అంటూ చైనా ప్రభుత్వ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ఈరోజు తన ఎడిటోరియల్ లో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారతదేశం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉన్న జీడీపీ, హిందూ మహాసముద్రం వరకు దూసుకెళ్లగల సైనిక పాటవం, ముఖ్యంగా భారత్ పొరుగు దేశాలతో చైనాకు ఉండే సత్సంబంధాలు చైనా సొంతం.
ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో ఉన్న చైనా.. భారత్ గేమ్ ను సహిస్తుందా? భారతదేశ ఆధిపత్యం ముందు చైనా తల వంచుతుందా? అంటూ ఆ పత్రిక తన సంపాదకీయంలో ప్రశ్నలు గుప్పించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదని, దీనికి రాజకీయ రంగు పులమకూడదని భారత్ మొదటినుంచీ చైనాకు చెబుతూనే వస్తోంది.
భారత్ చర్యను చైనా మీడియాతోపాటు అక్కడి అధికారులు, నిపుణులు కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్యలతో భారత్ తన గౌరవాన్ని కోల్పోతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. చైనాతో సత్సంబంధాల వల్ల భారతదేశమే అధికంగా లాభపడిందని, ఇప్పుడు ఆ సంబంధాలను దెబ్బతీయడం వల్ల తలెత్తే పరిణామాలను భారత్ తట్టుకోగలదా? అంటూ గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రశ్నించింది.
భారత్ ను ఇప్పటికీ స్నేహపూర్వక పొరుగుదేశంగానే చైనా చూస్తోందని, రెండు దేశాల నడుమ ఉన్న వివాదాలపై ఎన్నడూ రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని, దైలాలామా విషయంలో కూడా భారత్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, కాకపోతే తాము భారత్ తో ఎలా స్నేహపూర్వకంగా మసలుతున్నామో.. భారత్ కూడా అదేమాదిరిగా మసలుకోవాలని ఆ పత్రిక హితవు పలికింది.