టిక్ టాక్ హస్తగతం ప్లాన్స్ పై చైనా సీరియస్- యుద్ధం తప్పదంటూ అమెరికాకు హెచ్చరికలు..
చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్దకు చెందిన టిక్ టాక్ యాప్ అమెరికా విభాగాన్ని ట్రంప్ సర్కారు బలవంతంగా మైక్రోసాఫ్ట్ కు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాకరేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై చైనా తీవ్రంగా మండిపడుతోంది. వాణిజ్యపరమైన అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, అవాంఛనీయ ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని డ్రాగన్ చెబుతోంది. అమెరికా ఇవే ప్రయత్నాలు కొనసాగిస్తే తమకు యుద్దం తప్ప మరో ఆప్షన్ ఉండబోదని చైనా ప్రభుత్వ మీడియా తీవ్ర హెచ్చరికలు చేసింది.
Recommended Video
టిక్ టాక్ ను మైక్రోసాఫ్ కు అప్పగించాలని ఒత్తిళ్లు...
చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధకు చెందిన టిక్ టాక్ యాప్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి ఆదరణ పొందింది. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ చైనా యాప్ లను నిషేధించడంతో మన దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే కొంతకాలంగా చైనాపై పలు రకాలపై ఒత్తిడి పెంచుతున్న అమెరికా తన వాణిజ్య వ్యూహాల్లో భాగంగా టిక్ టాక్ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కు కట్టబెట్టేలా వ్యూహరచన చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో అడుగు ముందుకేసి టిక్ టాక్ ను సెప్టెంబర్ 15 లోగా మైక్రోసాఫ్ట్ కు అప్పగించాలని డెడ్ లైన్ కూడా పెట్టేశారు. దీంతో ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య మాటలయుద్దానికి కారణమవుతోంది.
చైనా మీడియా హెచ్చరికలు...
చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా తాజాగా టిక్ టాక్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా తప్పుబట్టింది. చైనా కంపెనీల పట్ల ట్రంప్ సర్కారు అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. అమెరికా ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొంటామని తెలిపింది. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు లొంగడం లేదా యుద్ధానికి సిద్ధం కావడం మినహా మరో దారి లేదని కూడా మీడియా వ్యాఖ్యానించింది. దీంతో టిక్ టాక్ ను కుట్ర పూరితంగా హస్తగతం చేసుకుంటే అమెరికాపై యుద్ధం తప్పదంటూ నేరుగా హెచ్చరికలు పంపినట్లయింది. భద్రతా కారణాలతో టిక్ టాక్ ను పూర్తిగా నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగి టిక్ టాక్ మాతృసంస్ద బైట్ డ్యాన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
చైనా హెచ్చరికలకు ట్రంప్ లొంగుతారా?
టిక్ టాక్ ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం యుద్ధం తప్పదనేలా చైనా మీడియా చేసిన హెచ్చరికలను ట్రంప్ సర్కారు పట్టించుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. చైనాతో వాణిజ్య యుద్ధం చేసే బదులు నేరుగా యుద్ధానికి ట్రంప్ తలుపులు తీస్తారా అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన వేళ కావాలనే ట్రంప్ ఇలాంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే చైనా మాత్రం గతంలో తమ సంస్ధలను, ప్రస్తుతం యాప్ లను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ సర్కారు చేపడుతున్న చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.