చైనా బందీలుగా భారత జవాన్లు.. గాల్వాన్ లోయలో హింస తర్వాత భయానక మైండ్ గేమ్.. ఇప్పుడు మైదానంలో..
కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను చైనా సైనికులు అతి కిరాతకంగా చంపేసినా.. మనకు బందీలుగా చిక్కినవాళ్లను వెంటనే వదిలేశాం. కానీ తన చేతికి చిక్కిన మనవాళ్లను వదిలేయడానికి మాత్రం చైనా భయంకరమైన మైండ్ గేమ్ ఆడింది. దశాబ్దాల తర్వాత సరిహద్దులో రక్తపాతానికి దారితీసిన గాల్వాన్ లోయలో.. ఆ మూడు రోజుల్లో చోటుచేసుకున్న ఘటనల తాలూకు వివరాలతోపాటే డ్రాగన్ కిరాతకాలు కూడా బయటకొస్తున్నాయి..
చైనా దురాగతం.. భారతీయ విద్యార్థులకు బెదిరింపులు.. బలవంతపు క్షమాపణలు.. అది ఆత్మహత్యేనంటూ..
ఆ మూడు రోజులు..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన రెండు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాలను కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నించగా, మనవాళ్లు గట్టిగా తిప్పికొడుతూ వచ్చారు. శాంతి చర్చల్లో భాగంగా బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా.. చివరి నిమిషంలో చైనా ఎదురుతిరింది. గాల్వాన్ లోయలో మళ్లీ టెంట్లు వేయడంతో భారత్ అభ్యంతరం తెలిపింది. ఈక్రమంలో ఈనెల 15న రాత్రి హిసాత్మక ఘర్షణ జరిగింది. రెండు వైపులా ప్రాణనష్టంతోపాటు బందీలుగానూ చిక్కారు. జవాన్ల విడుదలకు సంబంధించి 16, 17 తేదీల్లో నాటకీయ పరిణామాలు జరిగినట్లు సైనికవర్గాలు తెలిపాయి.
ఎవరు ఎక్కడ పడ్డారో తెలీదు..
సైనిక వర్గాలు చెప్పిన వివరాలను బట్టి.. గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 14) వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణ.. ఆయుధాలు లేని మినీ యుద్ధంలా సాగింది. పథకం ప్రకారం చైనా ముందుగానే ఇనుప మేకులు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో దాడి చేయగా, మనవాళ్లు రాళ్లతో ప్రతిదాడికి దిగారు. ఆ చిమ్మచికట్లో తన్నకుంటూ ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియని పరిస్థితి. కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని 14వ బిహార్ బెటాలియన్ ఆపదలో చిక్కుకుందని తెలియగానే.. పంజాబ్ రెజిమెంట్ కు చెందిన 3వ బెటాలియన్ పీపీ14 వైపునకు కదిలింది. వాళ్లతోపాటు సాయుధ బృందాలు కూడా వెళ్లాయి. అప్పటికే అక్కడున్నవాళ్లంతా ప్రాణాలు కోల్పోయో, గాయాలతోనో కిందపడిపోయి ఉన్నారు...
చైనా దుష్టబుద్ధి..
గాల్వాన్ లోయలో మినీ యుద్ధం ముగిసిన కొద్ది నిమిషాల తర్వాత.. ఎక్కడెక్కడో పడిపోయిన తమ సైనికుల కోసం రెండు పక్షాలు అటూ ఇటూ కలియదిరిగాయి. అయితే, కొట్లాడుకుంటూ బోర్డర్ కు కొద్దిగా దూరంగా వెళ్లినవాళ్లు బందీలుగా చిక్కారు. చైనాకు చెందిన ఓ మేజర్ తోపాటు దాదాపు 20 మంది సైనికులు మనవాళ్లకు బందీలుగా దొరికారు. భారత సైన్యానికి చెందిన నలుగురు అధికారులతోపాట 50 మంది చైనా చేతికి చిక్కారు. 15వ తేదీ రాత్రి ఘర్షణ జరగ్గా, 16న ఉదయమే మనవాళ్లు చైనా బందీలను తిరిగి అప్పగించేశారు. కానీ చైనా మాత్రం మనోళ్లను వదిలేయడానికి నానా రకాల మైండ్ గేమ్స్ ఆడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
చర్చల్లో సాగదీత..
‘‘మన జవాన్లను బందీలుగా చేసుకున్న విషయాన్ని చైనా దాచిపెట్టలేదు. వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారని పదేపదే చెప్పినా.. విడుదల విషయంలో మాత్రం ఏవేవో సాకులు చెబుతూ సాగదీస్తూ వచ్చారు. ఎదుటివాళ్లను హింసిస్తూ ఆనందించే తరహాలో చైనా వ్యవహరించింది. ఎలాంటి ఫలితం లేకుండా చర్చలు కొన్ని గంటలపాటు సాగేవి.. అలా.. 16వ తేదీ సాయంత్రం నాటికి మనవాళ్లు 40 మంది తిరిగొచ్చేసినా.. మిగతా 10 మంది విడుదలను చైనా మళ్లీ జాప్యం చేస్తూవచ్చింది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాతగానీ ఆ 10 మందిని కూడా విడిపెట్టారు..''అని సైనిక వర్గాలు వెల్లడించాయి. అలా మూడు రోజుల పాటు చైనా పైశాచికానందాన్ని పొందింది.
పాకిస్తాన్ పై దాడికి భారత్ ప్లాన్.. చైనా ఇష్యూని డైవర్ట్ చేసేందుకే.. ఖురేషీ సంచలనం
చైనా తాజా టార్గెట్లు..
గాల్వాన్ లో హింసాత్మక ఘర్షణ జరిగి వారమైనా తిరక్కముందే తూర్పు లదాక్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దేవ్ సాంగ్ సెక్టార్లను చైనా టార్గెట్ చేసింది. ఈ రెండూ మైదాన ప్రాంతాలే కావడం గమనార్హం. గీతకు అటువైపు చైనా భారీగా ఆర్మీ క్యాంపులు ఏర్పాటుచేసి, ఆయుధాలు సమకూర్చుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. నిజానికి ఈ ఎత్తుగడను ఊహించిన భారత్.. దౌలత్ బేగ్, దేవ్ సాంగ్ ప్రాంతాల్లో ముందస్తుగానే బలగాలను సిద్ధంగా ఉంచింది. 2013, 2016లో ఈ ప్రాంతంపై పట్టుకు చైనా విఫలయత్నం చేసింది. గత అనుభవాల రీత్యా అక్కడ వ్యూహాత్మక రోడ్లను నిర్మించిన భారత్ తన పట్టు కొనసాగిస్తున్నది.