బుస కొడుతోన్న డ్రాగన్: టిబెట్ వద్ద కఠిన వాతావరణంలో చైనా మాక్ వార్ డ్రిల్: 4700 మీటర్ల ఎత్తున
బీజింగ్: భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాలను చైనా తెగే దాకా లాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. యుద్ధ భేరీని మోగించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యంత కఠిన వాతావరణంలో తమ దేశ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి యుద్ధ శిక్షణను ఇస్తోంది. వార్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఓ పూర్తిస్థాయి యుద్ధానికి అవసరమైన సామాగ్రిని, పదాతిదళాన్ని తరలించింది. ప్రత్యేకించి- రాత్రివేళ ఈ మాక్ వార్ డ్రిల్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా ఆర్మీ చొరబాటు,నదీజలాల మళ్లింపు.. దీటుగా భారత్ ప్రతిఘటన.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
లడక్ను పోలిన వాతావరణం..
భారత్తో సరిహద్దులను పంచుకుంటోన్న టిబెట్ వాతావరణం కాస్త అటు ఇటుగా లడక్ ప్రాంతాన్ని పోలి ఉంటుంది. లడక్ తరహా భౌగోళిక వాతావరణాన్ని కలిగి ఉంటుంది టికెట్లోని కొంత భాగం. టిబెట్లోని తంగుల్లా పర్వత ప్రాంతానికి దీనికోసం ఎంచుకుంది. సముద్ర మట్టం నుంచి 4700 మీటర్ల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం. లడక్ తరహాలోనే అక్కడ కూడా వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటు ఉంటాయి. అనూహ్యంగా ఎండ కాస్తుంటుంది. అదే స్థాయిలో చలీ ఉంటుంది. దీనితోపాటు లడక్లో కనిపించినట్టుగానే సువిశాల ప్రాంతాలు అధికం..నిలువెత్తు పర్వత శ్రేణులూ ఎక్కువే.
రాత్రివేళ వార్ డ్రిల్స్
ఇప్పటికే యుద్ధ సామాగ్రిని, పదాతి దళాన్ని పెద్ద ఎత్తున తంగుల్లా పర్వత ప్రాంతానికి తరలించిన పీఎల్ఏ అధికారులు పూర్తిస్థాయిలో వార్ డ్రిల్స్ను కొనసాగిస్తోందని చైనా నుంచి వెలువడే గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ వెల్లడించింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో తంగుల్లా పర్వత ప్రాంతం తుపాకులు, గ్రనేడ్ల మోతలతో మారుమోగిపోతోందని పేర్కొంది. పూర్తిస్థాయిలో యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.
శతృవుల యుద్ధ వాహనాలను ధ్వంసం చేసేలా..
ఆ ప్రదేశానికి డ్రోన్లు రాకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారని, పీఎల్ఏ సైనికులు నైట్ విజన్ పరికరాలతో అహర్నిశలు కపలా కాస్తున్నారని వెల్లడించింది. మోర్టార్ షెల్స్, రైఫిల్స్, హ్యాండ్ గ్రనేడ్స్, శతృవును నేలకూలర్చడానికి వినియోగించే బోఫోర్స్ గన్స్ వంటి వాటితో యుద్ధ సన్నాహాలను చేస్తున్నట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ)ను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. టార్గెట్ను ధ్వంసం చేయడానికి యుద్ధ సమయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో.. అదే తరహాలో మ్యాప్లను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొంది.
స్కౌట్ బెటాలియన్తో
స్కౌట్ బెటాలియన్ విభాగం సైనికులు ఈ మాక్ వార్ డ్రిల్స్లో పాల్గొంటున్నట్లు కమాండర్ మా క్వియాన్ పేరును ఉటంకించింది ఆ కథనం. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం మొత్తం హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో ఉండేవే. ప్రత్యేకించి లడక్ సెక్టార్ వైపు ఈ ఆల్టిట్యూడ్ మరింత అధికంగా ఉంటుంది. అందుకే యుద్ధ ప్రాంతాన్ని పోలి ఉండేలా సముద్ర మట్టానికి 4700 అడుగుల ఎత్తు ఉన్న తంగుల్లా పర్వత శ్రేణుల ప్రదేశాన్ని దీనికోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.