భారత పర్యటనకు చైనా అధినేత జిన్పింగ్: రాచమర్యాదలతో: ఆ విషయంలో సపోర్ట్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ స్థాయి సమావేశాలు కొనసాగుతూనే వస్తోన్నాయి. ఒక్క లఢక్ మాత్రమే కాకుండా.. ఒకవైపు సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై జంక్షన్ వివాదం.. మరోవంక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించడం వంటి పరిణామాలతో భారత్-చైనా మధ్య ఉద్రిక్తత యధాతథంగా ఉంటోంది.
Recommended Video
బ్రిక్స్ భేటీలో పాల్గొనడానికి..
ఈ పరిణామాల మధ్య చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్.. భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత్ వేదిక కాబోతోండటమే దీనికి కారణం. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. మరో అయిదారు నెలల్లో బ్రిక్స్ సమ్మిట్.. భారత్లో ఏర్పాటు కాబోోతోంది. ఇందులో పాల్గొనడానికి జిన్పింగ్ భారత్కు వస్తారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిక్స్ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించితే తప్ప.. జిన్పింగ్ భారత పర్యటన దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు.
వాణిజ్య యుద్ధం నేపథ్యంలో..
ప్రాణాంతకమైన కరోనా వ్యాక్సిన్కు పుట్టినిల్లుగా మారిందంటూ ప్రపంచ దేశాలు ఆరోపించడం, భారత్తో తలెత్తిన సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాపై కొన్ని రకాల ఆంక్షలను విధించింది. చైనాతో భారత్ ఏకంగా వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీసింది. ఆ దేశానికి చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. వందకు పైగా యాప్ల వినియోగాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో ఈ సారి బ్రిక్స్ సమావేశాలను భారత్లో నిర్వహించడానికి చైనా తన మద్దతు తెలిపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్కు చైనా సపోర్ట్..
బ్రిక్స్ దేశాల మధ్య గల సత్సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది భారత్ నుంచే ఆరంభమౌతుందని తాము ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. బ్రిక్స్ సమావేశాలను భారత్లో నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తోందని చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరంగా బ్రిక్స్ దేశాల ఇచ్చిపుచ్చుకోవాల్సిన వాతావరణాన్ని తమ మధ్య నెలకొల్పుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్ను నిర్మూలించడంలో ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా ఉద్యమించాయని, ఇక ఆర్థిక స్థితిగతులను పునరుద్ధరించుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని వెన్బిన్ అన్నారు.
వర్చువల్ విధానంలో భేటీ..
బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ ఎప్పుడు నిర్వహించాలానేది ఇంకా ఖరారు కాలేదు. భారత్లో ఏర్పాటు చేస్తారనేది స్పష్టమైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో.. అంటే జూన్ తరువాత ఎప్పుడైనా బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని వర్చువల్ విధానంలో నిర్వహిస్తారా? లేక ఆయా దేశాధినేతలు, ప్రతినిధులు స్వయంగా భారత్కు వస్తారా? అనేది తేలాల్సి ఉంది. వర్చువల్ విధానంలో నిర్వహించినప్పటికీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖిగా ఇందులో పాల్గొంటారు.